టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరేట్ తెలుగు హీరోనని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. తాను సౌతిండియా మూవీలు ఎక్కువగా చూస్తానని, తెలుగు, తమిళ్ రాకపోయినా.. హిందీలో డబ్ అయిన ప్రతీ చిత్రం చూస్తానని చెప్పాడు.
హైదరాబాద్లో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరేంద్ర సెహ్వాగ్.. తెలుగు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని తెలిపాడు. రిటైర్మెంట్ అనంతరం తన జీవితం చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాడు. 'రిటైర్మెంట్ అనంతరం నాకు చాలా టైమ్ దొరుకుతుంది. దాంతో నేను దక్షిణాది చిత్రాలను ఎక్కువగా చూస్తున్నాను.

నా ఫేవరేట్ తెలుగు హీరో మహేష్ బాబు. అతని సినిమాలు చాలా చూశాను. అల్లు అర్జున్ కూడా ఇష్టమే. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. పుష్ప-1, 2 ఇప్పటికే రెండు, మూడు సార్లు చూశాను. అందులోని "తగ్గేదేలే" డైలాగ్, అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ నా మైండ్లో ఉన్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను రెండుసార్లు చూశాను. 'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏం చేస్తున్నారని అడగ్గా.. సెహ్వాగ్ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.
'2015లో రిటైర్ అయ్యాను కదా.. ఇక నాకు చేయడానికి పని ఏం ఉంది? ఖాళీగా ఉన్నప్పుడు మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా' అని నవ్వించాడు. తనకు తెలుగు, తమిళం రాదని, హిందీలోకి డబ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సెహ్వాగ్తో పాటు కపిల్ దేవ్, సురేశ్ రైనా పాల్గొన్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు టోర్నమెంట్ పోస్టర్ను విడుదల చేశారు.
టాలీవుడ్ ప్రో లీగ్ అనేది టాలీవుడ్కు సంబంధించిన సరికొత్త క్రికెట్ లీగ్. ఈ లీగ్కు నిర్మాత దిల్ రాజు గౌరవ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్లో మొత్తం 6 జట్లు పోటీ పడనున్నాయి. ఏడాదికి రెండు సీజన్ల చొప్పున ఈ లీగ్ నిర్వహించనున్నారు. సినీ నటులు, టెక్నిషియన్లు, సినీ ప్రముఖులు ఆటగాళ్లుగా ఆడనున్నారు. ప్రముఖ నిర్మాతలు 6 జట్లకు యజమానులుగా వ్యవహరించనున్నారు. టాలీవుడ్ ప్రో లీగ్ మొదటి సీజన్ ఫిబ్రవరి 13, 2026 నుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి.