న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచే వరకూ మహేంద్ర సింగ్ ధోనీ కిచిడీ మాత్రమే తిన్నాడని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆ టోర్నీ సమయంలో జట్టులో ప్రతీ ఒక్కరూ ఒక్కో సెంటిమెంట్ను ఫాలో అయ్యారని గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసిన నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్తో పాటు ప్రతీ ఒక్కరికి ఏదో ఒక మూఢ నమ్మకం ఉండేదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ధోనీ అయితే కిచిడీ మాత్రమే తిన్నాడని తెలిపాడు. '2011 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత జట్టులోని అందరికీ ఏదో ఒకటి సెంటిమెంట్గా ఉండేది. అందరూ వాళ్ల సెంటిమెంట్స్ను కచ్చితంగా ఫాలో అయ్యేవారు.

ధోనీ అయితే వరల్డ్ కప్ పూర్తయ్యేదాకా కిచిడీ మాత్రమే తిన్నాడు. ఎందుకని అడిగితే, నేను పరుగులు చేయకపోయినా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందిగా.. మనం మ్యాచులు గెలుస్తున్నాం కదా.. అది చాలుగా అనేవాడు. వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ విజయం కోసం మేం 2008 నుంచే సన్నాహకాలు మొదలు పెట్టాం.
రోహిత్ సేన కూడా ప్రపంచ కప్ గెలవాలంటే వీలైనంత త్వరగా సన్నాహకాలు ప్రారంభించాలి. ప్రపంచకప్లో అనుసరించాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. ముందస్తు ప్రణాళికలు సిద్దంగా ఉంటే.. ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ Bతో విజయం సాధించవచ్చు'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
తాము సచిన్ టెండూల్కర్ కోసం 2011 ప్రపంచకప్ను గెలిచామని, ఇప్పుడు కోహ్లీ కోసం ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలవాలని సెహ్వాగ్ పిలుపునిచ్చాడు. 'మేం సచిన్ టెండూల్కర్ కోసం వరల్డ్ కప్ ఆడాం. మేం వరల్డ్ కప్ గెలిస్తే సచిన్కు అది గొప్ప వీడ్కోలు అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా సేమ్. అందరూ కూడా అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని ఆడుతారు. అతను మైదానంలో ఎప్పుడూ వందకు వంద శాతం పోరాడుతాడు.' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.