
న్యూఢిల్లీ: రాజకీయాల వల్లనే తాను టీమిండియా కెప్టెన్ కాలేకపోయానని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. గ్రేగ్ చాపెల్ హెడ్ కోచ్గా వచ్చిన సమయంలో తానే టీమిండియా తదుపరి కెప్టెన్ అని చెప్పారని, ఆ తర్వాత రెండు నెలలకే జట్టులో నుంచి తీసాసారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన సెహ్వాగ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విదేశీ కోచ్లను నియమించడం తనకు నచ్చేది కాదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
'గ్రేగ్ చాపెల్ టీమిండియా హెడ్ కోచ్గా నియమితుడైన సమయంలో టీమిండియా తదుపరి కెప్టెన్ నేనే అని చెప్పారు. కానీ 2 నెలలకే నన్ను జట్టులో నుంచి తీసేశారు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్న నన్ను కెప్టెన్ కాకుండా రాజకీయం చేశారు. నేను ఎప్పుడూ భారత జట్టుకు మంచి కోచ్ కావాలనుకునేవాడిని. అయితే ఫారిన్ కోచ్లను నియమించడం నాకు నచ్చేది కాదు. అసలు విదేశీ కోచ్ల అవసరం ఏముంది? అనేది నా ప్రశ్న. సీనియర్ ఆటగాళ్లను కూడా ఇదే అడిగేవాడిని. జాన్ రైట్ తర్వాత మళ్లీ ఓ విదేశీ కోచ్ ఎందుకు? అని ప్రశ్నించేవాడిని.
అప్పటి సీనియర్ ఆటగాళ్లంతా కూడా భారత కోచ్లతో చాలా రోజులు పని చేశారు. వాళ్లతో స్వేచ్చగా మాట్లాడుకునేందుకు కావాల్సినంత స్వేచ్ఛ ఉండేది. అయితే భారత కోచ్లు ఉంటే వాళ్లకి నచ్చిన ప్లేయర్లనే జట్టులో ఆడిస్తారని, కొందరికి కొందరు ప్లేయర్లు ఫెవరెట్లుగా ఉంటారని, వాళ్ల కోసం ఇతర ఆటగాళ్లను పక్కనబెడతారని చెప్పారు. విదేశీ కోచ్ వస్తే అలా కాదు. జట్టులో ఉండడానికి ఎవరు అర్హులో వారినే ఆడిస్తార తెలిపారు. కానీ విదేశీ కోచ్లు కూడా ఒత్తిడికి గురయ్యేవారు.
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టును నడిపించడం ఎవరికీ అంత సులువైన విషయం కాదు. నా వరకైతే టీమిండియాకు హెడ్ కోచే అవసరం లేదు. ఓ మంచి టీమ్ మేనేజర్ ఉంటే సరిపోతుంది. అదరి ప్లేయర్లతో స్నేహంగా ఉంటూ.. ఏ ఆటగాడికి ఎంత కోచింగి ఇవ్వాలో తెలిసిన వ్యక్తి అయితే సరిపోతుంది. ఈ విషయంలో గ్యారీ కిర్స్టన్ బెస్ట్. అతను నాతో 50 బంతులు మాత్రమే ప్రాక్టీస్ చేయించేవాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్లతో మాత్రం 200 బంతులు ఆడించేవాడు. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చేవాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.