న్యూఢిల్లీ: రెండు సార్లు ఛాంపియన్, తమ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ టీమ్ ప్రస్తుతం వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్ టోర్నీలో పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. అయితే వెస్టిండీస్ క్రికెట్ బోర్డులోని రాజకీయాలే ఆ జట్టును నాశనం చేశాయని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
వెస్టిండీస్ నిష్క్రమణపై ట్విటర్ వేదికగా స్పందించిన అతను జట్టులో రాజకీయాలు ఉండొద్దని చెప్పడానికి వెస్టిండీస్ టీమ్ ఒక నిదర్శనమని పేర్కొన్నాడు. 'వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు. టాలెంట్ ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి విండీస్ మంచి ఉదాహరణ. రాజకీయాలే ఆ జట్టును దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి వెస్టిండీస్ జట్టుకు ఇంకేమి మిగల్లేదు'' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఇక నేలకు కొట్టిన బంతిలా వెస్టిండీస్ టీమ్ పుంజుకుంటుందని భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, మదన్లాల్ అభిప్రాయపడ్డారు. 'వన్డే ప్రపంచకప్కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోవడం బాధగా ఉంది. వాళ్లకు టీ20లు అంటేనే ఆసక్తి ఉంది. దేశానికి ఆడడాన్ని గర్వకారణంగా భావించట్లేదు'అని 1982 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్లాల్ అన్నాడు.
వెస్టిండీస్ బలంగా పుంజుకుంటుందని గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'విండీస్ అంటే నాకెంతో ఇష్టం. ప్రపంచ క్రికెట్లో నంబర్వన్ జట్టుగా నిలిచే సత్తా వారికి ఉందని ఇప్పటికీ నమ్ముతున్నా'అని గంభీర్ ట్వీట్ చేశాడు.
వెస్టిండీస్ పతనానికి ఆర్థిక సంక్షోభం కూడా ఓ కారణమని ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు క్రికెట్లోకి రాకముందే ఈ పతనం ప్రారంభమైందన్నాడు. 'నెమ్మది నెమ్మదిగా జరిగిన పతనమిది. ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలుపెట్టక ముందే వెస్టిండీస్ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా మా జట్టు వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు.
టీ20ల్లో మాత్రమే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయ్యాం. ఆ తర్వాత ఇంకా మెరుపులు లేవు. పతనం వేగంగా సాగింది. ప్రస్తుత విండీస్కు ఇంతకు మించి ప్రదర్శన చేసే సత్తా ఉందని నమ్ముతున్నా. కెప్టెన్, కోచ్లు మారారు. వారికి కుదురుకునే సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే అదరగొడుతుంటే.. వెస్టిండీస్ ఎందుకు మెరుగుకాకూడదూ?'' అని బిషప్ ప్రశ్నించాడు.