సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్
వీరేందర్ సెహ్వాగ్.. సన్రైజర్స్ హైదరాబాద్ విజయానికి అభినందనలు తెలుపుతూ, ఆ జట్టు బౌలర్లు టీ నటరాజన్, రషీద్ ఖాన్లను ప్రశంసించాడు. ఒక ఓం తెవాటియా నమః అంటూ ట్వీట్ను ముగించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో సంచలన బ్యాటింగ్తో రాత్రికి రాత్రే హీరోగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) పేరును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
ఓం తెవాటియా నమః
'సన్రైజర్స్ పేసర్ టీ నటరాజన్ ప్రదర్శన చాలా ఆనందం కలిగించింది. ఇన్నింగ్స్ చివరలో యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రషీద్ ఖాన్ కూడా తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అన్ని జట్లు కూడా లీగ్లో బోణీ చేయడంతో పాటు అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాయి. ఫన్ ఇలాగే కొనసాగుతుంది. ఓం తెవాటియా నమః' అని వీరేందర్ సెహ్వాగ్ తనదైన స్టయిల్లో ట్వీట్ చేశాడు.
నటరాజన్ అద్భుత బౌలింగ్
ఐపీఎల్ 2020లో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటుతూ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, రాహుల్ తెవాటియా, శుభ్మన్ గిల్ పరుగుల వరద పారిస్తుండగా.. టీ నటరాజన్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు.
రషీద్ సూపర్ స్పెల్
ఢిల్లీ క్యాపిటల్స్తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో తడబడ్డ ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన నటరాజన్ 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో కీలకమైన 18వ ఓవర్లో నటరాజన్ బాగా బౌలింగ్ చేశాడు. క్రీజులో హిట్టర్ మార్కస్ స్టొయినీస్ ఉన్నా.. అతన్ని ఔట్ చేసి 7 పరుగులే ఇచ్చాడు. ఇక రషీద్ ఖాన్ 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
IPL 2020 అత్యధిక పరుగుల జాబితా.. టాప్-5లో ముగ్గురు భారతీయులే!!