న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బాధితులకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. తన పేరిట ఓ ఫౌండేషన్ స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ఫౌండేషన్ గత నెల 25నే ట్విటర్ వేదికగా ప్రకటించింది.
ఇప్పటివరకు 51వేలకు పైగా కరోనా బాధితులకు ఆహారాన్ని ఉచితంగా అందించినట్లు ఫౌండేషన్ తాజా ట్వీట్లో వెల్లడించింది. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది.
ఇంకా ఎవరైనా బాధితులు అన్నం లేక అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. తమకు సహాయం చేయాలనుకున్న వారు virenderfoundation84@upiకి విరాళాలు అందించాలని తెలిపింది. కోవిడ్పై జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులంతా భాగస్వామ్యులవుతున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళంతో పాటు ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టారు.
శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్ ఉనద్కత్, ప్యాట్ కమిన్స్ తదితర ఆటగాళ్లు తమకు తోచిన సాయాన్ని అందించారు. కరోనా కష్ట కాలంలో మరో మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్.. ప్రజలకు సాయం చేస్తున్నాడు. ప్రజలకు ఫాబి ఫ్లూ టాబ్లెట్లను ఉచితంగా పంచుతున్నాడు. సచిన్ టెండూల్కర్ సైతం తన వంతు సాయాన్ని ప్రకటించాడు.