టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వచ్చిన కోపంతో మూడేళ్ల ముందే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నానని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. కానీ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనను అడ్డుకున్నాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు సచిన్ మాట వినికపోయి ఉంటే వరల్డ్ కప్ కల నెరవేరకుండానే మిగిలిపోయిందన్నాడు.
విధ్వంసకర బ్యాటింగ్కు మారు పేరు అయినా సెహ్వాగ్ 2007- 2008లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. వరుసగా విఫలమవ్వడంతో అప్పటి కెప్టెన్ ధోనీ.. సెహ్వాగ్ను తుది జట్టులో నుంచి తప్పించాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లంతా ధోనీకి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సెహ్వాగ్ పంచుకున్నాడు. '2007-2008లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్లో తొలి మ్యాచ్లు ఆడా. ఆశించిన రీతిలో రాణించలేకపోయాను. దాంతో అప్పటి కెప్టెన్ ధోనీ తుది జట్టులో నాకు అవకాశం ఇవ్వలేదు. తుది జట్టులో లేకపోతే వన్డేలు ఆడటం అనవసరమని భావించా. ఇదే విషయాన్ని సచిన్కు చెప్పా. వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని చెప్పా. అప్పుడు సచిన్ వద్దని చెప్పాడు. తాను కూడా 1999-2000 సీజన్లో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాని, రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నానని చెప్పాడు.
ఆ తర్వాత పరిస్థితులు చక్కడబడ్డాయని, నువ్వు కూడా ఇదే దశలో ఉన్నావని, భావోద్వేగంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాడు. మరో రెండు సిరీస్లు వేచి చూడాలన్నాడు. అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చాడు. ఆ మాటలతో నా నిర్ణయం మార్చుకున్న నేను.. నా ఫామ్పై దృష్టి పెట్టా. ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నా.'అని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
తన కొడుక్కి కూడా ఒత్తిడిని మైండ్లోకి తీసుకోవద్దని చెబుతానని తెలిపాడు. 'క్రికెట్లో ఒత్తిడి అనేది సహజం. దాన్ని ఎప్పుడూ మైండ్లోకి తీసుకోవద్దని నా కొడుకు ఆర్యకు చెప్పా. రంజీ ట్రోఫీ అయినా.. టీమిండియా ఆడేటప్పుడైనా ఇదే వర్తిస్తుంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ కుమారులు ఇద్దరు ఆర్యవీర్, వేదాంత్ సెహ్వాగ్లు ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడుతున్నారు.
ధోనీ నాయకత్వంలోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం 8 మ్యాచ్లు ఆడి 380 పరుగులు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన సచిన్(482), గౌతం గంభీర్(393) తర్వాత మూడో బ్యాటర్గా సెహ్వాగ్ నిలిచాడు. బంగ్లాదేశ్పై తొలి మ్యాచ్లో భారీ శతకం(175) బాదిన సెహ్వాగ్.. సెమీఫైనల్లో పాక్పై 38 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.