
న్యూఢిల్లీ: తనపై ట్రోలింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు వీరేంద్ర సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్కు తాను పెద్ద అభిమానినని తెలిపాడు. సదుద్దేశంతోనే వడపావ్ అనే పదాన్ని వాడనని, హిట్మ్యాన్ను అవమానించాలని కాదని స్పష్టం చేశాడు. కోల్కతా నైట్రైడర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ప్యాట్ కమిన్స్ సునామీ ఇన్నింగ్స్తో గెలిచే మ్యాచ్ను ముంబై చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం.
అయితే ఈ ఫలితాన్ని ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో చమత్కారంతో కూడిన ట్వీట్ చేశాడు. 'నోటీకాడి వడ పావ్ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ను లాగేసుకున్నాడు'అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్న హిట్ మ్యాన్ అభిమానులు సెహ్వాగ్పై ట్రోలింగ్ దిగారు. తమ అభిమాన క్రికెటర్ను అవమానిస్తావా? అంటూ మండిపడ్డారు. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుసుకున్న సెహ్వాగ్.. రోహిత్ అభిమానులకు మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
'వడా పావ్ అనేది ముంబై నగరానికి రిఫరెన్స్. అక్కడ అది చాలా ఫేమస్. రోహిత్ ఫ్యాన్స్ కూల్గా ఉండండి. నేను మీకంటే హిట్ మ్యాన్ బ్యాట్కు పెద్ద అభిమానిని.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్), పొలార్డ్ ( 5 బంతుల్లో 3 సిక్స్లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 56 నాటౌట్) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మురుగన్ అశ్విన్ (2/25), మిల్స్ (2/38) ఆకట్టుకున్నారు. ఇది ముంబైకి వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.