
న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో తన శైలిలో ఆడే ఆటగాడే లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అన్నాడు. కాకపోతే పృథ్వీ షా, రిషభ్ పంత్ల బ్యాటింగ్ శైలి కొంచెం తనలానే ఉంటుందని చెప్పాడు. ఇక ముల్తాన్ టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ ముంగిట సిక్స్ కొడతానని సచిన్ టెండూల్కర్ చెబితే బండ బూతులు తిట్టాడని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ప్రస్తుత భారత జట్టులో నా మాదిరి బ్యాటింగ్ చేసే బ్యాటర్ లేడు. కాకపోతే రిషభ్ పంత్, పృథ్వీ షాల బ్యాటింగ్ శైలి కొంచెం నా బ్యాటింగ్తో సరిపోల్చవ్చు. టెస్టు క్రికెట్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్ తీరు.. దూకుడుగా ఆడే స్వభావం కాస్త నా ఆటను పోలి ఉంటుంది. కానీ అతను 90, 100 పరుగులతోనే సంతృప్తి పడతాడు. నేను మాత్రం అలా కాదు. బరిలోకి దిగితే డబుల్ సెంచరీ, 250, 300 బాదాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతా. రిషభ్ పంత్ కూడా నాలాగే ఆలోచిస్తే అభిమానులను మరింత అలరించినవాడవుతాడు.

ఇక సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీల ముంగిట సింగిల్స్ తీయడం కంటే భారీ షాట్లు ఆడటానికి నేను ఎక్కువగా ఇష్టపడేవాడిని. చిన్న వయసులో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ బాగా ఆడేవాడిని. అప్పుడు నేను ఎక్కువగా బౌండరీలు బాదడానికే ఇష్టపడేవాడిని. అదే అలవాటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా కొనసాగింది. సెంచరీ వేయడానికి ఎన్ని బౌండరీలు కావాలో అని లెక్కలు వేసుకునే వాడిని. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు 10 సింగిల్స్ తీయడం కంటే.. రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదితే సరిపోతుందని ఆలోచించేవాడిని.
ముల్తాన్ టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఆడాను. అలా ఆడటం వల్ల రిస్క్ కూడా తగ్గుతుందన్నాడు. ముల్తాన్ టెస్టులో నేను సెంచరీ చేయడానికి ఆరు సిక్సర్లు కొట్టాను. ఆ సమయంలో సచిన్ బ్యాటింగ్కు వచ్చాడు. అప్పుడు సచిన్ నాతో.. 'నువ్వు మళ్లీ సిక్సర్ కొడితే బ్యాట్ తో కొడతా'అని హెచ్చరించాడు. దాంతో నేను 120 నుంచి 295 పరుగుల మధ్యలో ఒక్క సిక్సర్ కూడా బాదలేదు. కానీ 295 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ కొడతానని సచిన్తో అన్నాను.

అప్పుడు సచిన్ సీరియస్గా 'నీకేమైనా పిచ్చా?'అని మందలించాడు. భారత్ తరఫున ఎవరూ ట్రిపుల్ సెంచరీ చేయలేదని, నీకు ఆ అవకాశం దక్కిందని తెలిపాడు. బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటావా? అని తిట్టాడు. అప్పుడు నేను ఎవరూ 295 కూడా కొట్టలేదు కదా? అని బదులిచ్చాను. ఆ మరుసటి బంతికే సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్లో సిక్సర్ బాది ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాను. నా ట్రిపుల్ సెంచరీని నా కన్నా సచిన్ ఎక్కువగా సంతోషించాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.