న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి చోటుదక్కకపోవడంపై అభిమానుల నుంచి తీవ్రఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. వరల్డ్కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఘాటుగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఒక్క ప్రపంచకప్ గెలవనోళ్లు కూడా లెజెండరీ కెప్టెన్ కాంట్రాక్టు తొలగించడం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పరుగు తీస్తూ బౌలర్ను ఢీకొట్టిన బ్యాట్స్మన్ (వీడియో)
ఇక మరోవైపు ధోనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం సరైందేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ధోనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ విశ్లేషించిన ఓ బీసీసీఐ అధికారి మాటల్ని వీరేంద్ర సెహ్వాగ్ సమర్థించాడు.
'హర్భజన్ సింగ్ 2015 నుంచి భారత్ తరఫున మ్యాచ్లు ఆడటం లేదు. రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకూ భజ్జీ రిటైర్మెంట్ గురించి ఎవరూ మాట్లాడ లేదు. చర్చించలేదు. కానీ ధోనీ గురించి మాత్రం అడుగుతున్నారు. నిలదీస్తున్నారు. ఎందుకంటే.. అలా అడుగుతూ వార్తల్లో నిలవడం వారికిష్టం. ఇక రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. టీమ్లోకి ఆటగాడి ఎంపిక, వేటు పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం. సెలెక్టర్లతో చర్చించిన తర్వాతే సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటిస్తోంది. గత ఏడాది జూలై నుంచి వన్డే మ్యాచ్లు ఆడని ధోనికి బీసీసీఐ ఏ లెక్కన సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి..?' అని సదరు అధికారి ప్రశ్నించాడు. ఓ స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు.
ఆ విషయం ధోనికి బాగా తెలుసు.. కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలు
అలాగే జట్టులోని ఆటగాళ్ల స్థానాలపై ధోనికున్నంత స్పష్టత మరేవరికి ఉండదని కొనియాడాడు. ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఆటగాళ్ల విఫలమైనా అండగా ఉండేవాడని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలా ఉండటం లేదని సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఇక గతేడాది వన్డే ప్రపంచకప్ అనంతరం బ్యాట్ పట్టని ధోని.. తన చుట్టూ ఎంత జరుగుతున్నా మౌనంగానే ఉంటున్నాడు. తన భవిష్యత్తుపై అటు బీసీసీఐ కానీ, ఇటు ధోని కాని స్పష్టత ఇవ్వడం లేదు. ఇక ధోని ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్లేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఈ జార్ఖండ్ డైనమైట్ భవితవ్యం ఐపీఎల్తో తేలనుందన్నాడు.