
ఎక్స్ట్రా రన్..
అశ్విన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా పరుగు తీశాడని, ఇదే విషయాన్ని అతను ఔటైన తర్వాత టీమ్ సౌథీ ప్రస్తావించాడని సమాచారం. అయితే సౌథీకి సమాధానం చెబుతూ వెళ్తున్న అశ్విన్ ముందు మోర్గాన్ కూడా ఇదే ప్రస్తావించడం గొడవకు ఆజ్యం పోసినట్లైందని, దాంతో చిర్రుత్తుకుపోయిన అశ్విన్ కేకేఆర్ కెప్టెన్పై మండిపడినట్లు దినేశ్ కార్తీక్ చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది.
'వెంకటేశ్ అయ్యర్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని పంత్.. పాయింట్లోకి షాట్ ఆడి సింగిల్ తీశాడు. కానీ రాహుల్ త్రిపాఠి త్రో చేసిన బంతి పంత్ను తాకి దూరంగా వెళ్లింది. ఇంతలో అశ్విన్ పరుగు కోసం పంత్ను ఆహ్వానించాడు. ఇద్దరూ పరుగు తీశారు. అయితే మోర్గాన్కు ఇది నచ్చలేదు. నిజానికి... బాల్ బ్యాట్స్మెన్, బ్యాట్, ప్యాడ్ను తాకిన తర్వాత.. పరుగు తీయడం సరికాదు. ఇది.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అతడు భావిస్తాడు. అందుకే ఈ గొడవ చోటు చేసుకుంది'అని మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
క్రీడా స్పూర్తికి విరుద్దమా?
ఇక కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా ఇయాన్ మోర్గాన్ను సిల్వర్ డక్గా పెవిలియన్ చేర్చి అశ్విన్ ఫర్ఫెక్ట్ రివేంజ్ తీసుకున్నాడు. పంత్తో కలిసి అశ్విన్ రచించిన వ్యూహంలో మోర్గాన్ చిక్కుకున్నాడు. దాంతో అశ్విన్ తెగ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఎక్స్ట్రా రన్ తీసి అశ్విన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడా? అనే విషయంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద డిబేట్ జరుగుతోంది.
ఈ విషయంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు రెండుగా విడిపోయారు. అయితే మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మాత్రం.. ఈ చిన్న విషయానికి ప్రపంచం రెండుగా విడిపోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశాడు. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకూడదని, మళ్లీ అశ్వినే దోషిగా ఉండాల్సిన అవసరం లేదని వార్న్ పేర్కొన్నాడు. ఇక్కడ మోర్గాన్ చేసింది సరైనదేనంటూ అశ్విన్ తీరును వార్న్ తప్పుబట్టాడు.
అవును మోర్గాన్ సంసారి..
అయితే మోర్గాన్ తీరును భారత అభిమానులు తప్పుబడుతున్నారు. 'చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది తప్పుడు పనులు'అనే సామెత మోర్గాన్ వ్యవహారశైలికి సరిగ్గా సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా పరుగుల ఎలా? తీస్తావ్? అని అశ్విన్ను ప్రశ్నించిన మోర్గాన్.. ఇదే మాట వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎందుకు అనలేదని నిలదీస్తున్నారు. బెన్ స్టోక్స్ బ్యాట్ తగిలి అప్పనంగా వచ్చిన నాలుగు పరుగులను ఎందుకు వద్దనలేదని ప్రశ్నిస్తున్నారు.
న్యూజిలాండ్తో జరిగిన నాటి మెగా ఫైనల్లో మార్టిన్ గప్టిల్ విసిరిన ఓవర్త్రో.. బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీకి వెళ్లింది. దాంతో ఇంగ్లండ్కు అప్పనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు మోర్గాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
ఢిల్లీ జైత్రయాత్రకు బ్రేక్..
ఇక ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. లీగ్లో ఐదో విజయంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నరైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో నైట్రైడర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఇన్నింగ్స్లో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరిగారు. షార్జా అంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇన్నింగ్స్లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 18.2 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసి 10 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్), శుభ్మన్ గిల్(33 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30) రాణించారు. చివర్లో సునీల్ నరైన్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/13) మూడు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబడా చెరొక వికెట్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications












