టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్నేహితుడు, 2008 అండర్ 19 ప్రపంచకప్ హీరో తన్మయ్ శ్రీవాస్తవ అంపైర్గా మారాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అంపైర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఆటగాడిగా.. అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ప్రస్తావించడంతో తన్మయ్ శ్రీవాస్తవ వార్తల్లో నిలిచాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్నేహితుల గురించి చెబుతూ శ్రీవాస్తవ ప్రస్తావన తీసుకొచ్చాడు. శ్రీవాస్తవ అంపైర్గా మారడని, చెన్నైలో కలిసానని చెప్పాడు. దాంతో తన్మయ్ శ్రీవాస్తవ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించారు.
అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్ విన్నర్..
విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టులో తన్మయ్ శ్రీవాస్తవ సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో తన్మయ్ శ్రీవాస్తవ 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్ల్లో 262 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన తన్మయ్ శ్రీవాస్తవ.. పార్ట్టైమ్ బౌలింగ్ చేసేవాడు.

ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ 2008-09 సీజన్లో యూపీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం 90 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు. 44 లిస్ట్ A మ్యాచ్లలో 7 హాఫ్ సెంచరీలతో 1728 పరుగులు, 34 టీ20 మ్యాచ్లలో 649 పరుగులు నమోదు చేశాడు.
డెక్కన్ ఛార్జర్స్ ప్లేయర్..
ఐపీఎల్లో తన్మయ్ 2008 నుంచి 2010 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ, 2012లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడాడు. అయితే ఐపీఎల్లో అతనికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కేవలం 7 మ్యాచ్ల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించినా అవకాశాలు రాకపోవడంతో తన్మ శ్రీవాస్తవ 30 ఏళ్ల వయసులోనే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంపైర్గా శిక్షణ తీసుకున్నాడు. అతను బీసీసీఐ లెవెల్ 2 అంపైరింగ్ కోర్సును పూర్తి చేశాడు.
ఐపీఎల్ 2025లో అంపైర్గా..
తాజా సీజన్లో తన్మయ్ శ్రీవాస్తవ అంపైర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత తన్మయ్ దేశీయ క్రికెట్లో కూడా అంపైర్గా పనిచేశాడు. అంతేకాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కోసం టాలెంట్ స్కౌట్గా, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అండర్-16 ఫీల్డింగ్ కోచ్గా కూడా పనిచేశాడు. చెన్నై వేదికగా సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్కు శ్రీవాస్తవ అంపైర్గా వ్యవహరించాడు. ఆ సమయంలోనే శ్రీవాస్తవను కోహ్లీ కలుసుకున్నాడు.