టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో శతకాన్ని అందుకున్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 143 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాడు.

మార్నస్ లబుషేన్ వేసిన 135వ ఓవర్ మూడో బంతిని స్వీప్ షాట్తో లెగ్ సైడ్ బౌండరీ తరలించిన కోహ్లీ.. కెరీర్లో 30వ శతకం సాధించాడు. సెంచరీ పూర్తయిన వెంటనే తన సతీమణి అనుష్క శర్మ ఉన్న గ్యాలరీ వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు. ఈ సందర్భంగా అతని కుమారుడు అకాయ్ టీవీ కెమెరాలకు చిక్కాడు. అనుష్క శర్మ తండ్రి ఒడిలో అకాయ్ ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్కు అనుష్క శర్మ తన కుమారుడు అకాయ్తో కలిసి వచ్చారు. కోహ్లీ సెంచరీ అనంతరం కెమెరాలన్నీ ఆమెను చూపించడంతో అకాయ్ ఫొటోలు తొలి సారిగా బయటకు వచ్చాయి. అకాయ్ అచ్చం విరాట్ కోహ్లీలాగే ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
విరుష్క దంపతులకు వామికా, అకాయ్ ఇద్దరు పిల్లలుగా.. వీరిని మీడియాకు దూరంగా పెంచుతున్నారు. కెమెరాల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే తమ పిల్లల ఫొటోలు తీయవద్దని మీడియా సంస్థలు, ఫొటోగ్రాఫర్లకు ఈ దంపతులు విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా కూడా వామికా ఫొటోలు ఇలానే వైరల్ అయ్యాయి. అప్పట్లోనూ ఆ ఫొటోలను తొలగించాలని ఈ ఇద్దరూ విజ్ఞప్తి చేశారు.
కోహ్లీ సెంచరీ పూర్తి అయిన వెంటనే భారత్ రెండో ఇన్నింగ్స్ను 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ(143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 100 నాటౌట్)తో పాటు యశస్వి జైస్వాల్(297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 161), కేఎల్ రాహుల్(176 బంతుల్లో 5 ఫోర్లతో 77), నితీష్ కుమార్ రెడ్డి(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) రాణించారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు. దాంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలడంతో భారత్కు 46 పరుగుల ఆధిక్యం లభించింది.