న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వీకిపీడియాలో అత్యధిక మంది వీక్షించిన టాప్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ వీకిపీడియా పేజీని ఇప్పటివరకు 43.3 మిలియన్ల మంది వీక్షించారు. కోహ్లీ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 24.1 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్ 23.6 మిలియన్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు వృత్తిపరమైన వివరాలను వీకిపీడియా అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖుల పుట్టిన రోజు, సొంత ఊరు, కుటుంబ సభ్యులు, విద్య, కెరీర్ విశేషాలు, సాధించిన ఘనతలు అన్నీ వీకిపీడియాలో లభ్యమవుతాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్స్ కలిగియున క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు.

ఫేస్బుక్, ఇన్స్టా, ట్విటర్ వేదికగా కోహ్లీ 100 మిలియన్స్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక ఫాలోవర్లు కలిగియున్న మూడో ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. ఫిట్నెస్ ఫ్రీక్గా ఉండే విరాట్ కోహ్లీకి క్రికేటేతర ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 2021 టీ20 ప్రపంచకప్ వరకు మూడు ఫార్మాట్ల కెప్టెన్గా కొనసాగిన కోహ్లీ.. ఆ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
ప్రస్తుతం ప్లేయర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. ఆసియా కప్ 2022లో సెంచరీల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ.. అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాడు. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
బుధవారం నుంచి డొమినికా వేదికగా జరిగే తొలి టెస్ట్లో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ గడువు సమీపిస్తున్నా టీమ్ కాంబినేషన్పై టీమిండియా మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్తో పాటు వికెట్ కీపర్, ఓపెనింగ్ కాంబినేషన్పై తెగ చర్చలు జరుపుతోంది.
బౌలింగ్లో నలుగురు బౌలర్లపై స్పష్టత ఉన్నా.. ఐదో బౌలర్గా ఎవరిని తీసుకోవాలన్నదే సమస్యగా మారింది. ఈ ఒక్క స్థానం కోసం ముగ్గురు పేసర్లు జయదేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైనీ, ముకేశ్ కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి టెస్టు వేదికైన ద విండర్స్ పార్క్ (డొమినికా).. వేదికగా ఎక్కువ మ్యాచ్లు జరగలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో ఐదు టెస్టులు, నాలుగు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్లు మాత్రమే జరిగాయి.