టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీకి భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటి అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. శత్రు దేశం పాకిస్థాన్లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నా.. కెప్టెన్గా ఒక్క ప్రపంచకప్, ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆ విషయం మరోసారి స్పష్టమైంది. కోహ్లీ వాడేసిన జెర్సీని వేలం వేయగా రూ. 40 లక్షలు పలికింది. అతని గ్లోవ్స్ రూ. 28 లక్షలకు అమ్ముడయ్యాయి.బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దివ్యాంగ చిన్నారుల సంక్షేమం కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో కోహ్లీ వస్తువులే అధిక ధర పలికాయి.

ఈ ఫౌండేషన్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని అతియా శెట్టి ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చిన్నప్పటి నుంచి ఈ ఫౌండేషన్తో తనకు అనుబంధం ఉందని, ఇక్కడి పిల్లలకు బోధించడం, వారితో సమయం గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదని గుర్తు చేసుకుంది. తన నానమ్మ ప్రారంభించిన ఈ ఫౌండేషన్కు తాను మద్దతుగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఈ ఫౌండేషన్కు విరాళాలు అందించేందుకు రాహుల్-అతియా శెట్టిలు భారత స్టార్ క్రికెటర్ల వస్తువులను వేలం వేసారు. శుక్రవారం జరిగిన ఈ వేలంలో కోహ్లీ జెర్సీ, గ్లోవ్స్ అధిక ధర పలికాయి. కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు పలకగా.. గ్లోవ్స్ రూ. 28 లక్షలకు అమ్ముడయ్యాయి. రోహిత్ బ్యాట్ రూ. 24 లక్షలు, ధోనీ బ్యాట్ రూ. 13 లక్షలు, ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలు, రాహుల్ జెర్సీ రూ. 11 లక్షలు పలికాయి. ఈ కార్యక్రమం ద్వారా రాహుల్-అతియా దంపతులు మొత్తం రూ. 1.93 కోట్లు సేకరించారు. ఈ మొత్తాన్ని విప్లా ఫౌండేషన్కు అందించనున్నారు.
రాహుల్-అతియా చేపట్టిన ఈ గొప్ప పనికి ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు మద్దతు తెలిపారు. వీళ్ళతో పాటూ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్వింటన్ డి కాక్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా మద్దతుగా నిలిచారు.