టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లేయర్ విరాట్ కోహ్లీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ.. ప్రత్యర్థి వికెట్ కీపర్ అయిన సంజూ శాంసన్తో హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ మ్యాచ్లో వానిందు హసరంగా వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ క్విక్ డబుల్ తీసాడు. వేగంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురైన కోహ్లీ.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరాడు. వెంటనే శాంసన్.. తన కీపింగ్ గ్లోవ్స్ తీసేసి.. కోహ్లీ చాతిపై చేతిని పెట్టి హార్ట్ బీట్ చెక్ చేశాడు. బాగానే ఉందని సంజూ శాంసన్ చెప్పడంతో.. కోహ్లీ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు.

ఈ ఘటనతో కోహ్లీ ఫ్యాన్స్ భయాందోళనకు గురవుతున్నారు. కోహ్లీకి ఏమైనా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండలో బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ డీహైడ్రేషన్కు గురయ్యాడని మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.