టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డాడు. కొందరు ఆకతాయిలు ఏఐ టెక్నాలజీ సాయంతో విరాట్ కోహ్లీ అనని మాటలు అన్నట్లు వీడియోను రూపొందించి వైరల్ చేశారు.
టీమిండియా యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తేన్నారు. 'ఏఐ చాలా ప్రమాదం సుమా..!'అని కామెంట్ చేస్తున్నారు.

ఆ వీడియో ఏం ఉందంటే..?
ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ను అవమానించినట్లుగా ఆ వీడియోను రూపొందించారు. 'ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత అత్యున్న స్థాయిలో సక్సెస్ కావాడానికి కావాల్సింది ఏంటో గుర్తించాను. శుభ్మన్ గిల్ను నేను చాలా దగ్గరగా చూశాను. అతను నైపుణ్యం కలిగిన ఆటగాడే.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను భవిష్యత్తు ఆటగాడిగా ఎదిగేందుకు.. దిగ్గజ ఆటగాడిగా మారేందుకు చాలా తేడా ఉంది. అతని టెక్నిక్ అద్భుతం. కానీ అతను మమ్మల్ని చేరుకోలేడు. జనాలు అతను మరో విరాట్ కోహ్లీ అవుతాడని ప్రశంసిస్తున్నారు. కానీ అతను ఎప్పటికీ మరో కోహ్లీ కాలేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పటికీ ఒక్కడే.
భారత్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే బెంచ్ మార్క్ సెట్ చేశారు. గిల్ ఈ స్థాయికి చేరుకోవాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.'అని విరాట్ కోహ్లీ చెప్పినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. అయితే విరాట్ కోహ్లీ నిజమైన ఇంటర్వ్యూలోని కొన్ని పదాలను ఇందులో ఉపయోగించడంతో ఇది నిజమైన వీడియో అని నెటిజన్లు పొరబడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఎంత మేలు జరుగుతుందో అంతే ప్రమాదం పొంచి ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఈ టెక్నాలజీ పెద్ద సమస్యగా మారింది. సౌతిండియా టాప్ హీరోయిన్ రష్మీక మంధాన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అశ్లీలంగా ఉన్న వీడియోపై తీవ్ర దుమారం రేగింది. సదరు వీడియోను రూపొందించిన వ్యక్తిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు.
టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డాడు. ఆయన పేరిట దుండగులు ఓ అడ్వర్టైజ్మెంట్ వీడియోను ఏఐ సాయంతో రూపొందించారు.