టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం భావోద్వేగభరితమైన పోస్ట్తో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ తనను ఎంతో పరీక్షించిందని, ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఎంతో ఇచ్చిందని.. గుండె నిండా సంతోషంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నానని కోహ్లీ తన ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ నిర్ణయంతో షాక్కు గురైన అభిమానులు.. అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు. కోహ్లీ సాధించిన ఘనతలను నెమరువేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 టెస్ట్లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్లు గెలిచింది.

2014 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తొలిసారి టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో ఆడిన 10 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మురళీ విజయ్, శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. మిడిలార్డర్లో ఆడిన చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మల్లో పుజారా, రహానే జట్టుకు దూరమయ్యారు. కానీ రిటైర్మెంట్ ప్రకటించలేదు. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాతో పాటు వరుణ్ ఆరోన్ వీడ్కోలు పలికారు. కర్ణ్ శర్మ, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ మాత్రం ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇందులో షమీ ఒక్కడికే భారత జట్టులో చోటు దక్కనుంది.