ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న మీడియా ఛానెళ్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యం విషయంలో ప్రచారం అవుతున్న అసత్య కథనాలను ఆయన ఖండించారు. వాస్తవాలు తెలుసుకొని కథనాలు రాయలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరమవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని కొందరంటే.. కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతుందని మరికొందరు ప్రచారం చేశారు. కొన్ని జాతీయ చానెల్స్ సైతం సరోజ్ కోహ్లీ అస్వస్థతకు గురైందని కథనాలు రాసుకొచ్చాయి.

దాంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. సరోజ్ కోహ్లీ ఆరోగ్యంగా ఉండాలని పోస్ట్లు పెట్టారు. ఈ పోస్ట్లను చూసి అవాక్కైన వికాస్ కోహ్లీ.. ఈ అసత్య ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తల్లికి ఏం కాలేదని, ఆరోగ్యంగా ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ కథనాలను ప్రచారం చేయవద్దని, వాస్తవాలు తెలుసుకొని రాయాలని మీడియాను మందలించారు.
ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. 'అందరికీ నమస్కారాలు.. మా అమ్మ హెల్త్ గురించి వైరల్ అవుతున్న అసత్య కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలోనే అందరికి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మా అమ్మ పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్గా ఉంది. ప్రతీ ఒక్కరితో పాటు మీడియాను నేను కోరేది ఏంటంటే... సరైన సమాచారం లేకుండా అసత్య కథనాలను ప్రచారం చేయకండి.

మా పట్ల ప్రేమను చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు.'అని వికాస్ కోహ్లీ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
ఎలాంటి కారణం చెప్పకుండా విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్ట్లకు దూరమవడంతోనే ఈ ఫేక్ న్యూస్ తెరపైకి వచ్చింది. బీసీసీఐ సైతం కోహ్లీ వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నాడని, అతని ప్రైవసీని గౌరవించాలని సూచించింది.
చివరి మూడు టెస్ట్లకు కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. ఈ వారంలోనే చివరి మూడు టెస్ట్లకు భారత సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.