ఫుట్బాల్ ప్రపచానికి లియోనల్ మెస్సీ ఎంత ఇష్టమో.. క్రికెట్కు విరాట్ కోహ్లీ అంతే అభిమానం. అతని అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలు.. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాయి. అతని ఆటే సచిన్ తర్వాతి స్థాయిని అందించింది. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులున్నారు. సోషల్ మీడియా వేదికగా అతన్ని కోట్ల మంది అనుసరిసస్తారు. కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్లను చూసే వారు లక్షల్లో ఉన్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డే ఫార్మాట్, ఐపీఎల్లో మాత్రమే కొనసాగనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే కోహ్లీ లక్ష్యంగా అర్థమవుతోంది. అయితే కోహ్లీ రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా.. అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా అతని ఆదాయం 29 శాతం పెరిగింది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఏ ప్లస్ కాంట్రాక్ట్ ఉంది. ఈ లెక్కన అతనికి ఏడాదికి రూ. 7 కోట్ల జీతం వస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనం. టెస్ట్ మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజు అందుకుంటున్నాడు.
అంతేకాకుండా విరాట్ కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. రూ. 12లక్షలతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కోహ్లీ.. ఇప్పుడు రూ. 21 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. 18 ఏళ్లలో ఐపీఎల్ ద్వారానే అతను రూ. 212 కోట్లు సంపాదించాడు. ఈ ఆదాయం కాకుండా విరాట్ కోహ్లీ అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని కంపెనీలను కూడా ప్రారంభించాడు.
ప్రస్తుతం కోహ్లీ నెట్వర్త్ రూ. 1050 కోట్లుగా తెలుస్తోంది. భారత దేశంలోనే అత్యంత ధనికమైన క్రీడాకారుడు కోహ్లీ. కోహ్లీ బ్లూ స్టార్, ఎమ్ఆర్ఎఫ్, పూమా వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. డిజిట్ ఇన్సూరెన్స్తో పాటు బ్లూ ట్రైబ్, వ్రాగన్, చిసెల్ ఫిట్నెస్, వన్8 అనే కంపెనీలను ప్రారంభించాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ మరిన్ని ఉత్పత్తులతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సొంతంగా కంపెనీలు కూడా ప్రారంభించవచ్చు.