టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్మ శర్మలకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. తమ వారుసుడికి అకాయ్ అని పేరు పెట్టినట్లుగా విరాట్ కోహ్లీ మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఫిబ్రవరి 15న కొడుకు పుట్టాడని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేశాడు.
అయితే వామికా తరహాలోనే అకాయ్ ఫొటోలను విరుష్క బయట పెట్టలేదు. మీడియాకు దూరంగా తమ పిల్లలను పెంచాలనుకుంటున్నామని గతంలోనే ఈ జోడీ ప్రకటించింది. వామికా పుట్టినప్పుడే అన్నీ మీడియా సంస్థలకు తమ కూతురిని ఫొటోలు తీయవద్దని లేఖ రాసింది. వామికా ముఖం కనబడకుండా జాగ్రత్త పడింది.

అకాయ్ విషయంలోనూ విరుష్క జోడీ అదే పద్దతిని అనుసరిస్తోంది. ఎక్కడా కూడా తమ కొడుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేయలేదు. దాంతో అభిమానులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ కుమారుడికి సంబంధించిన ఏఐ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి సంబంధించిన ఏఐ ఫొటోతో పాటు.. కోహ్లీ, అకాయ్లు కలిసి ఉన్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో అకాయ్ టీమిండియా జెర్సీ ధరించడం విశేషం. అది కూడా తన తండ్రి 18వ నెంబర్ జెర్సీ కావడం గమనార్హం.
ఇక విరాట్ కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడని గత 6 నెలలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ విరుష్క ఈ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేసింది. తన రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకే విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ ఆడటం లేదని బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దాంతో అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని ప్రచారం జరగ్గా.. అతని సోదరుడు వికాస్ కోహ్లీ ఖండించారు. తమ తల్లి ఆరోగ్యంగా ఉందని స్పష్టం చేశారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. కోహ్లీ రెండోసారి తండ్రి అవుతున్నాడని చెప్పి, అంతలోనే మాట మార్చాడు. దాంతో కోహ్లీ విరామంపై గందరగోళం నెలకొంది.
అయితే అనుష్క బేబీ బంప్కు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దాంతో కోహ్లీ రెండోసారి తండ్రి అవుతున్నాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే కోహ్లీ.. ఐదు రోజుల ఆలస్యంగా అసలు విషయాన్ని చెప్పాడు. విరుష్కకు జనవరి 11, 2021న వామిక జన్మనించింది. ఇప్పటి వరకు వామిక ఫొటోను మీడియాకు రిలీజ్ చేయలేదు.