కెప్టెన్సీ వదులుకున్నా..
క్రికెట్లో అత్యంత ఖరీదైన ప్లేయర్గా కోహ్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎమ్ఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్కు కోహ్లీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రధాన బ్రాండ్లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లీకి ఉన్న ఆదరణ. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర.. ఇలా ఏ వేదికైనా కోహ్లీకి పిచ్చ క్రేజ్ ఉంది. ఇది కోహ్లీ పర్ఫార్మెన్స్తో ఏమాత్రం సంబంధంలేని విషయమని ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్ తెలిపారు. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లీ బ్రాండ్పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.
'కోహ్లీ ఫామ్లోకి వస్తే అతని క్రేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు అతని బ్రాండ్ వాల్యూ మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. పైగా సచిన్ బ్యాట్స్మన్గా అద్భుతంగా రాణించాడు. దాంతో అతని వాల్యూ మరింత పెరిగింది. కోహ్లీ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.'అని తెలిపారు.
ఒక్క ప్రకటనకు..
కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసే ఒక్క వ్యాపార పోస్ట్కు కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్మెంట్ కోసం ఒక్కో బ్రాండ్కు ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్యా రహానే, కేఎల్ రాహుల్ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా.. కోహ్లీతో పోటీపడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం. కోహ్లీ గత కొంతకాలంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ.
రెండేళ్లుగా సెంచరీ చేయకున్నా..
రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లీని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లీ బ్రాండ్ విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లీది. అలాంటిది ప్లేయర్గా పర్ఫార్మెన్స్ కనబరిస్తే.. కోహ్లీ బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్. ''కోహ్లీ అప్పీయరెన్స్కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్ ఇమేజ్.. కోహ్లీ పేరిట నడుస్తోంది ఇప్పుడు.'అని ఆయన చెప్పుకొచ్చాడు.