
సమష్టి వైఫల్యం..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చివరకు టీమ్మేనేజ్మెంట్ వైఫల్యం కూడా ఈ ఓటములకు కారణం. మొత్తం జట్టుగా విఫలమయ్యారు. టీమ్ కాంబినేషన్ సెట్ చేయలేక ప్రత్యర్థికి తగిన ప్రణాళికలు రచించడంలో రవిశాస్త్రి నేతృత్వం, మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలోని టీమ్మేనేజ్మెంట్ విఫలమైంది. టాస్ ఓడితే ఎలా ఆడాలి, ఆరంభంలో వికెట్లు పడితే మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటనే విషయంలో సపోర్ట్ స్టాఫ్ విఫలమైంది. ఇక పరిస్థితులకు తగ్గట్లు ఆడటంతో పాటు ప్రణాళికలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు చేతులెత్తేసారు. అయితే ఇంత దారుణంగా విఫలమవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణమే కారణమా? అంటే అవుననే సమాధానమిస్తోంది.

కోహ్లీ X బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కోహ్లీ తీరు పట్ల అశ్విన్, రహానే, పుజారా వంటి సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నారనీ, ఈ ముగ్గురు బీసీసీఐ సెక్రటరీ జైషాకు లేఖ రాసారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఖండించినా.. ఆ కొద్ది రోజులకే కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. అంతలోనే టీ20 ప్రపంచకప్కు టీమిండియా మెంటార్గా ధోనీని నియమించామని బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు, కోహ్లీ మధ్య సయోధ్య కుదర్చేందుకే బీసీసీఐ ధోనీని తీసుకొచ్చిందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని గ్రహించే కోహ్లీ సారథ్య బాధ్యతలు వదిలేస్తున్నాని చెప్పాడని కూడా కథనాలు వెలువడ్డాయి.

అశ్విన్కు దక్కని చోటు..
అయితే వీటిని బీసీసీఐతో పాటు అశ్విన్ ఖండించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ను టీ20 ప్రపంచకప్ ఎంపిక చేసే విషయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని, మొదట కోహ్లీ ససేమిరా అన్నా ఆ తర్వాత అంగీకరించాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అశ్విన్కు విరాట్ ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. సీనియర్ అయిన అతన్ని కాదని, వరుణ్ చక్రవర్తీని తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. రెండు మ్యాచ్ల్లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. మరో వైపు బ్యాటింగ్ ఆర్డర్లో పనికిరాని ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు.

మరో 10 ఏళ్లు అయినా తెలవాల్సిందే..
పాకిస్థాన్తో ఓటమి తర్వాత రోహిత్ శర్మ స్థానంలో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను ఆడించవచ్చు కదా? అని ఓ పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్ కోసం రోహిత్ను పక్కనపెట్టాలా? అని నిలదీశాడు. కానీ న్యూజిలాండ్తో మ్యాచ్కు వచ్చే సరికి అదే చేశాడు. ఇషాన్ను ఓపెనర్గా దించి రోహిత్ను మూడో స్థానంలో ఆడించాడు. ఈ ప్రయోగం వికటించి బెడిసి కొట్టింది. అయితే రోహిత్ విషయంలో జర్నలిస్ట్పై మండిపడ్డ కోహ్లీ... చివరకు అదే వ్యూహాన్ని అమలు చేయడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు జట్టులో ఆటగాళ్ల మధ్య సరైన వాతావరణం ఉందా? అనిపిస్తోంది. ముఖ్యంగా టీమ్మేనేజ్మెంట్లో ఏకాభిప్రాయం కొరవడిందనే సందేహం కలుగుతోంది. భారత ఆటగాళ్ల ప్రవర్తన చూస్తుంటే డ్రెస్సింగ్ రూమ్లో బయటకు తెలియనిది ఏదో జరుగుతుందనేది మాత్రం అర్థం అవుతోంది. అయితే అది ఇప్పుడు తెలియకపోయినా ఏప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది. రవిశాస్త్రి, ధోనీ, లేక విరాట్ కోహ్లీనే.. మరో 10 ఏళ్లకు అయినా ఈ విషయాలను ప్రస్తావిస్తారు. లేదా తాము రాసే పుస్తకాల్లో పేర్కొంటారు.!


Click it and Unblock the Notifications
