టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కాళ్లు మొక్కాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కోహ్లీదని, అతన్ని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గురువులను గౌరవించాలనే విషయాన్ని కోహ్లీ తన చర్యతో చాటి చెప్పాడని కొనియాడుతున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు హాజరైన విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.. మ్యాచ్ అనంతరం కోహ్లీని కలిసాడు. రాజ్కుమార్ శర్మ రాకను గమనించిన కోహ్లీ వెంటనే అతని కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. కోహ్లీని హగ్ చేసుకున్న రాజ్కుమార్ శర్మ అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. రాజ్కుమార్ శర్మ కాళ్లను కోహ్లీ మొక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడినప్పుడు కూడా కోహ్లీ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.

నిన్నటి మ్యాచ్ అనంతరం జరిగిన సన్నివేశాలకు సంబంధించిన ఓ ఎడిటెడ్ వీడియోను ఆర్సీబీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా.. కోహ్లీ తన గురువు అశీర్వాదం తీసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ వీడియోలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్తో పాటు ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ కృనాల్ పాండ్యా మాట్లాడాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చూడటం లేదని, టాప్-2లో నిలవడమే లక్ష్యంగా పెట్టుకుందిన రజత్ పటీదార్ స్పష్టం చేశాడు. కృనాల్ పాండ్యా తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. సమష్టిగా రాణించడంతోనే ఈ విషయాలు దక్కాయని జితేశ్ శర్మ, ఆండీ ఫ్లవర్ అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్పై సాధించిన విజయంతో ఆర్సీబీ.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది. మరో విజయం సాధిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. మరో రెండు గెలిస్తే టాప్-2లో నిలవనుంది.