ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్టైమ్ రికార్డ్ ఊరిస్తోంది. ఆదివారం(అక్టోబర్ 19) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే ఈ రికార్డ్ను సమం చేసిన కోహ్లీ.. అధిగమించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.
పెర్త్ వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే ఈ రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతను టెస్ట్ల్లో 51 శతకాలతో టాప్లో ఉండగా విరాట్ కోహ్లీ.. 51 వన్డే సెంచరీలతో ఈ రికార్డ్ను సమం చేశాడు. ఆ తర్వాత వన్డేల్లో 49 శతకాలతో సచిన్, జాక్వస్ కల్లీస్ టెస్ట్ల్లో 45 సెంచరీలు, రికీ పాంటింగ్ టెస్ట్ల్లో 41 శతకాలతో కొనసాగుతున్నారు.

మూడు ఫార్మాట్లలో మాత్రం 100 శతకాలతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. 82 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశంతో కోహ్లీ 5 శతకాలతో కుమార సంగక్కర, రోహిత్ శర్మతో సమంగా ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే వారిని అధిగమిస్తాడు.
మూడు ఫార్మాట్లలో ఆసీస్ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్గా మాత్రం కోహ్లీనే కొనసాగుతున్నాడు. అతను ఆసీస్పై 12 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఆసీస్ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ 9 శతకాలతో టాప్లో ఉండగా.. రోహిత్, కోహ్లీ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. మరో సెంచరీ బాదితే సచిన్ రికార్డ్ను సమం చేస్తారు.
ఐపీఎల్ 2025 తర్వాత ఇంటికే పరిమితమైన కోహ్లీ, రోహిత్లు ఈ సిరీస్తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరి ఆటగాళ్లకు ఈ సిరీస్ దిశానిర్దేశం చేయనుంది.