
ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో స్పైడర్ క్యామ్ కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది. ముంబై వాంఖడే స్టేడియంలో టీ బ్రేక్ సమయానికి కొన్ని ఓవర్లు మిగిలుండగానే ఈ సంఘటన జరిగింది. సాంకెతిక లోపం తలెత్తడంతో పిచ్కు కొంచెం ఎత్తులోనే స్పైడర్ క్యామ్ ఆగిపోయింది. దాంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
అయితే.. స్పైడర్ క్యామ్ ఆగిపోయిన సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సబ్స్టిట్యూడ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ కెమెరా ముందుకు వచ్చి వెళ్లిపో అంటూ సైగలు చేశారు. క్లోజప్గా విచిత్రంగా నవ్వారు. ఈ రియాక్షన్స్ అన్నీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా స్పైడర్ కెమెరాతో కామెడీ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి 5 వికెట్ల దూరంలో నిలిచింది. ముందుగా ఫాలో ఆన్ ఆడనివ్వకుండా వేగంగా పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత తమ బౌలింగ్తో సగం వికెట్లను కూల్చింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నా.. మరో ఐదు వికెట్లు తీస్తే భారత్ విజయం లాంఛనమే. స్పిన్నర్ అజాజ్ పటేల్ వరల్డ్ రికార్డు మరిచిపోయేలా.. బ్యాటింగ్ వైఫల్యంతో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి దిశగా సాగుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్లో పేకమేడలా కూలి భారత బౌలర్లకు దాసోహమన్న బ్యాటింగ్ లైనప్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది.
ఓపెనర్లతో సహా సీనియర్ బ్యాటర్ విఫలమైనా సరే కొత్త ఆటగాళ్లు ఎదురొడ్డి మరీ జట్టు కుప్పకూలకుండా కాపాడారు. నాలుగో రోజుకు ఆటను తీసుకుపోగలిగారు. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్లో హెన్రీ నికోల్స్ (36 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర (2 బ్యాటింగ్) ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్ (6), రాస్ టేలర్ (6), టామ్ బ్లండెల్ (0) మరోసారి విఫలమయ్యారు. విల్ యంగ్ (20) కాస్త ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేదు. ఈ మూడు వికెట్లను అశ్విన్ (3/26) తన ఖాతాలో వేసుకున్నాడు.