న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి టీమిండియా తరఫున అత్యధిక మ్యాచ్లు గెలిచిన రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ.. తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 296వ విజయాన్ని అందుకున్నాడు.

ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 307 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. ధోనీ 295 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో 12 విజయాలు సాధిస్తే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమిస్తాడు.
డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీతో చేలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. అశ్విన్ 12 వికెట్లతో సత్తా చాటడంతో విండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ గురువారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్ 2-0 తేడాతో విజయం సాధించినా.. ఈ ర్యాంకును పదిలంగా ఉంచుకోలేని పరిస్థితి. ఎందుకంటే రెండో స్థానంలో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే మళ్లీ అగ్రస్థానం చేరుకుంటోంది. ఓడితే మాత్రం టీమిండియాదే టాప్ ర్యాంక్.