రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య వైరం కొనసాగుతోంది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు.
తమ ప్లేయర్ నవీన్ ఉల్ హక్పై కోహ్లీ స్లెడ్జింగ్ దిగడాన్ని తప్పుబట్టిన గంభీర్.. మ్యాచ్ అనంతరం కోహ్లీతో గొడవపడ్డాడు. ఐపీఎల్ 2023 సీజన్లోనే ఈ ఘటన అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి గంభీర్, విరాట్ కోహ్లీ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.

కోహ్లీతో గొడవపడ్డ నవీన్ ఉల్ హక్ను అతని అభిమానులు ఘోరంగా ట్రోల్ చేశారు. వారి ట్రోలింగ్ను తట్టుకోలేకపోయిన అతను.. తప్పును తెలుసుకొని విరాట్ కోహ్లీకి క్షమాపణలు కోరాడు. అఫ్గానిస్థాన్తో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ కూడా నవీన్ ఉల్ హక్ను ఏమనవద్దని, ఎంకరేజ్ చేయాలని తన అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.
అప్పటి నుంచి నవీన్ ఉల్ హక్ను కోహ్లీ ఫ్యాన్స్ వదిలేసారు. ఆ గొడవ తర్వాత గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఎదురుపడలేదు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్తో మళ్లీ ఈ ఇద్దరు ఢిల్లీ ఆటగాళ్లు ఎదురుపడ్డారు. కానీ ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ఒకరినొకరు చూసుకోలేదు.
ప్రాక్టీస్ సందర్భంగా.. ఈ ఇద్దరూ తారసపడిన ముఖం తిప్పుకున్నారు. అయితే కోహ్లీ మాత్రం అటువైపు తిరిగి ఉన్న గంభీర్వైపు చాలా కోపంగా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కోహ్లీ కోపంగా చూస్తున్న ఫొటోను కేకేఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
గతంలో కూడా కోహ్లీ, గంభీర్లు మైదానంలో గొడవపడ్డారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచి స్నేహపూర్వకంగా మెదిలినా.. తాజా గోడవతో పూర్తిగా దూరమయ్యారు. ఈ గొడవ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ గంభీర్పై వేటు వేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కోహ్లీ కెప్టెన్సీపై కూడా అవకాశం దొరికినప్పుడల్లా గంభీర్ విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ టైటిల్ గెలవలేనివాడికి కెప్టెన్సీ ఎందుకని, రోహిత్ శర్మకు అండగా మాట్లాడాడు. తాజా మ్యాచ్లోనూ ఈ ఇద్దరు మళ్లీ గొడవపడుతారా? కలిసిపోతారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.