ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లీ.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు.
బుధవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131 పరుగులు చేసాడు. గత ఐదు వన్డే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడో శతకం కావడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్ల్లో 58 శతకాలు నమోదు చేశాడు. సచిన్ 60 సెంచరీల రికార్డ్కు రెండు శతకాల దూరంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ శతకంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్(105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 122) సెంచరీతో రాణించగా.. నితీష్ రెడ్డి(23)తీవ్రంగా నిరాశపర్చాడు.
అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్ష్ ఆర్య(74), నితీష్ రాణా(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీయగా.. సత్యనారయణ రాజు, మారమ్రెడ్డి హేమంత్ రెడ్డి రెండేసి వికెట్లు తీసారు. నర్సింహ్మా రాజు ఒక వికెట్ పడగొట్టాడు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్స్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్కు కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందడంతో ప్రేక్షకుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది.
విరాట్ కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వస్తారని భావించిన కర్ణాటక ప్రభుత్వం విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్కు అనుమతివ్వలేదు. దాంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. దాంతో ప్రేక్షకులకు ఈ మ్యాచ్ చూసే అవకాశం లేకుండా పోయింది.