పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకుల్లో 27వ స్థానానికి పడిపోయాడు. ఒకప్పుడు పరుగుల రారాజుగా.. రికార్డులకు చిరునామాగా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు క్రీజులో కుదురుకోవడానికి తంటాలు పడుతున్నాడు.
గతంలో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో దిగజారుతున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ దారుణంగా పడిపోయాడు. 12 ఏళ్ల తర్వాత కోహ్లీ టెస్ట్ల్లో దారుణమైన ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. కోహ్లీ చివరిసారిగా డిసెంబర్ 2012లో 36వ టెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే 27వ ర్యాంక్కు పడిపోయాడు. ఇప్పటి వరకు కోహ్లీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ల్లో 25 స్థానాల కంటే కిందికి దిగజారడం ఇది రెండోసారి మాత్రమే.

విరాట్ కోహ్లీ కంటే పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ మెరుగైన ర్యాంక్లో కొనసాగుతున్నాడు. అతను ఐదు స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అగ్రస్థానంలో కొనసాగుతండగా.. కేన్ విలియమ్సన్, యశస్వి జైస్వాల్, ట్రావిస్ హెడ్ టాప్-5లో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా 3 స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 9వ స్థానంలో నిలిచాడు. టాప్-10లో భారత్ నుంచి ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉండటం విశేషం.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్ల్లో 190 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో కోహ్లీ 93 పరుగులే చేశాడు. వరుసగా రెండు సిరీస్ల్లో కోహ్లీ విఫలమవడంతో అతని ర్యాంక్ దారుణంగా పతనమైంది. టీమిండియా కూడా ఈ రెండు సిరీస్లను కోల్పోయింది. పేలవ బ్యాటింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లీకి అభిమానులు, మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.