టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో తనను ఔట్ చేసిన గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్కు విరాట్ కోహ్లీ అరుదైన బహుమతి ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. అంతేకాకుండా సదరు బౌలర్తో ఫొటో కూడా దిగాడు.
ఈ ఫొటోలను విశాల్ జైస్వాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'అతని ఆటను టీవీలో చూసినప్పటి నుంచి అతనితో మైదానం పంచుకునే వరకు.. గొప్ప అనుభూతులు'అనే క్యాప్షన్తో కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని విశాల్ జైస్వాల్ చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన వీడియోను విశాల్ జైస్వాల్ షేర్ చేశాడు. ఈ మ్యాచ్లో విశాల్ జైస్వాల్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్లో (131) సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. గుజరాత్తో జరిగిన రెండో మ్యాచ్లో 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 77 పరుగులు చేసాడు. సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీని గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్ స్టంపౌట్ చేశాడు. దాంతో యశస్వి జైస్వాల్ టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు.
గుజరాత్కు చెందిన 27 ఏళ్ల విశాల్ జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన విశాల్.. ఇప్పటి వరకు 16 టీ20లు, 12 లిస్ట్-ఏ మ్యాచ్లు, 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2022 అక్టోబర్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించిన విశాల్.. అరంగేట్ర మ్యాచ్లో 9వ స్థానంలో గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు. ఇప్పటి వరకు 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 వికెట్లు ఉన్నాయి. రెడ్ బాల్ క్రికెట్లో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఒక హాఫ్ సెంచరీ బాదాడు.