
గర్వపడుతున్నా..
'మాకు కావాల్సిన ఫలితం దక్కలేదు. కానీ టోర్నీ ఆసాంతం మా ఆటగాళ్లు కనబర్చిన పోరాటపటిమ పట్ల గర్వంగా ఫీలవుతున్నా. టోర్నీలో మా ప్రయాణం నిరాశగా ముగిసినప్పటికీ తలెత్తుకునేలా ఆడాం. తమకు సహకరించిన అభిమానులకు, మేనేజ్మెంట్, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు'అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. 'మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు మాపై పూర్తి ఆధిపత్యం కనబరిచారు. అదే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. వికెట్లు పడగొట్టారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. ఇది నాణ్యమైన బౌలింగ్కు సంబంధించిన విజయం. మేం చెత్తగా బ్యాటింగ్ చేశామని చెప్పలేం. ఆ ఓవర్(క్రిస్టియన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్లతో 22 పరుగులు) మా విజయవకాశాలను దెబ్బతీసింది.

15 పరుగులు చేసుంటే..
చివరి వరకు మేము శక్తిమేర పోరాడాం. ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేం అదనంగా మరో 15 పరుగులు చేసినా.. ఆ రెండు ఓవర్లలో (గార్టన్, క్రిస్టియన్) ప్రత్యర్థిని కట్టడి చేసినా ఫలితం మరోలా ఉండేది. సునీల్ నరైన్ మేటి బౌలర్. ఈ రోజు మరోసారి ఆ విషయాన్ని రుజువు చేశాడు. షకీబ్, వరుణ్ కూడా అద్భుతంగా రాణించారు. మాపై ఒత్తిడి పెంచి.. మా బ్యాటర్లపై పైచేయి సాధించారు. వారి ధాటికి మా ఆటగాళ్లు స్వేచ్చగా షాట్లు ఆడలేకపోయారు. ఇక కెప్టెన్గా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి.. వారు స్వేచ్ఛగా ఆడగలిగేలా చేశాను. టీమిండియా సారథిగా కూడా ఇదే పని చేశాను. నా అత్యుత్త ప్రదర్శనను ఇచ్చాను. ఇక ఆర్సీబీ ఫ్రాంఛైజీ కోసం వందకు 120 శాతం బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేశాను. వచ్చే ఏడాది నుంచి ఆటగాడిగా కూడా అదే స్థాయిలో కష్టపడతాను.

ఆఖరి మ్యాచ్ వరకు ఆర్సీబీలోనే..
కచ్చితంగా.. ఆర్సీబీలోనే ఉంటాను. వేరే జట్టు తరఫున ఆడే ఉద్దేశమే లేదు. ఇతర సంతోషాల కంటే... లాయల్గా ఉండటమే నాకు ముఖ్యం. నా కెరీర్ చివరి ఐపీఎల్ మ్యాచ్ వరకు ఆర్సీబీలోనే ఉంటాను. వచ్చే ఏడాది మెగావేలం జరగనుంది. మరో రెండు, మూడేళ్లకు కావాల్సిన కోర్టీమ్ను తీసుకోవాలి'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ.. 140 మ్యాచ్ల్లో 66 విజయాలందిచగా... 70 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. నాలుగింటిలో ఫలితం తేలలేదు. సారథిగా 2016లో ఆర్సీబీని ఫైనల్ చేర్చిన కోహ్లీ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాడు.
బ్యాట్స్మన్ తడబాటు..
ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్వెల్(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుభ్మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
