టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతారనే వార్తలు వస్తున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే వారు కచ్చితంగా దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా సన్నదమవుతున్నారు. ఇప్పటికే టీమిండియా ఫిట్నెస్ టెస్ట్లను క్లియర్ చేసి ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమయ్యారు.
రోహిత్ శర్మ కూడా 20 కిలోల బరువు తగ్గి సన్నగా మారిపోయాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే అతను బరువు తగ్గి ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027కు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ ఈ సమయంలో టీమిండియా ఆడే వన్డేలు చాలా తక్కువ. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్లు అప్పటి వరకు జట్టులో కొనసాగుతారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ కారణంతోనే కెప్టెన్సీ మార్పు చేశామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వెల్లడించాడు.

ఒకవేళ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ ఆడాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. వచ్చే ఏడాది న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు వారు విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది. గేమ్ టైమ్ పొందడం కోసం వారు బరిలోకి దిగాల్సి ఉంటుంది. కనీసం మూడు, నాలుగు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఐదు వారాల విశ్రాంతి లభించనుంది. ఈ సమయంలోనే విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. ఈ సమయంలో ఢిల్లీ, ముంబై జట్లు కనీసం 6 మ్యాచ్లు ఆడనున్నాయి.
'డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి వన్డేకు, జనవరి 11న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్కు మధ్య ఐదు వారాల సమయం ఉంది. డిసెంబర్ 24న విజయ్ హజారే టోర్నీ ప్రారంభమవుతుంది. ముంబై ఆరు రౌండ్లు ఆడనుండగా.. రోహిత్ కనీసం మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. కోహ్లీ కూడా అంతే'అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఒకవేళ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడితే.. 15 ఏళ్ల తర్వాత తొలి లిస్ట్-ఏ గేమ్ ఆడుతాడు. కోహ్లీ తన ఆఖరి లిస్ట్ ఏ మ్యాచ్ను ఢిల్లీ తరఫున 2010లో ఆడాడు. రోహిత్ శర్మ మాత్రం 2018లో చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ఉన్నాడు కాబట్టి.. జట్టులో కొనసాగాలంటే రోహిత్ అయినా కోహ్లీ అయినా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.