
దుబాయ్: తమ విజయంలో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహల్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. చాహల్ గేమ్చేంజర్ అని తాము ముందే అనుకున్నామని, అద్భుత బౌలింగ్తో సూపర్ విక్టరీని అందించాడని కొనియాడాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 10 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే.
సన్రైజర్స్ను విజయం దిశగా నడిపిస్తున్న జానీ బెయిర్ స్టో(61)ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన చాహల్.. ఆ మరుసటి బంతికే విజయ్ శంకర్(0)ను ఔట్ చేసి సన్రైజర్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అంతకుముందు మనీశ్ పాండే(34)ను ఔట్ చేసి 71 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. దీంతో ఆర్సీబీ ఐపీఎల్ 2020 సీజన్లో బోణీ కొట్టింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్.. చాహల్తో పాటు యువ బ్యాట్స్మన్ దేవదూత్ పడిక్కల్ను ప్రశంసించాడు. 'ఇదో అద్భుత విజయం. చాహల్ తన స్పిన్తో మ్యాచ్ను మావైపు తిప్పేశాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబరుస్తాడని ముందే అనుకున్నాం. తన స్పిన్ మ్యాజిక్తో అద్బుతం చేశాడు. పిచ్ తనకు అనుకూలంగా మారితే ఎంత ప్రమాదకారే తెలిసేలా చేశాడు. అంతవరకు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నబెయిర్ స్టోను తెలివైన బంతితో బోల్తా కొట్టించి మంచి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత అదే ఓవర్లో విజయ్శంకర్ను క్లీన్బౌల్డ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తన మణికట్టు మాయాజాలంతో రానున్న రోజుల్లో చహల్ చాలా కీలకంగా మారనున్నాడు.
ఆఖరి బంతి వరకు పోరాడాల్సిందేనని మా ఆటగాళ్లకు చెప్పాను. ఐపీఎల్లో ఎప్పుడేం జరుగతుందో చెప్పలేమని హెచ్చిరించాను. ఇక బ్యాటింగ్లో యువ కెరటం దేవదూత్ పడిక్కల్ మొదటి మ్యాచ్లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. మంచి శుభారంభం దక్కిందన్నా.. 20 పరుగులు ఎక్కువ చేశామన్నా దానికి పడిక్కల్ సూపర్ పెర్ఫామెన్స్ కారణం. అతనికి ఫించ్ మంచి సహకారం అందించాడు. పడిక్కల్కు మంచి భవిష్యత్తు ఉంది. డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిస్టర్ 360 అనే పేరును మరోసారి సార్థకం చేసుకున్నాడు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో దుబాయ్ వేదికగా 24న ఆడనుంది.