చెత్త బౌలింగ్తో..
'మేం 175 పరుగులు చేయాల్సింది. అప్పుడు పోరాడటానికి వీలుండేది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించింది. కానీ మా బౌలర్లు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. చాలా బౌండరీలు ఇచ్చారు. చెన్నై బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. కచ్చితమైన యార్కర్లతో మమ్మల్ని కట్టడి చేశారు. దాంతో ధాటిగా ఆడటం కష్టంగా మారింది. కేవలం లూస్ బాల్స్ను మాత్రమే ఆడాల్సి వచ్చింది. మా బౌలర్లు మాత్రం చాలా బౌండరీ బాల్స్ ఇచ్చారు. ఎక్కడైతే బౌలింగ్ చేయవద్దమని చెబుతామో ఆ ఏరియాల్లోనే బంతులు వేసి మూల్యం చెల్లించుకున్నారు.
X ఫ్యాక్టర్ మిస్సింగ్..
ముఖ్యంగా ఫస్ట్ పవర్ ప్లేలో ధారళంగా పరుగులిచ్చుకున్నారు. మా బౌలింగ్లో తొలి ఐదు ఓవర్లలో X ఫ్యాక్టర్ మిస్సయింది. కానీ లో స్కోరింగ్ గేమ్స్ను కాపాడుకోవాలంటే కచ్చితమైన బంతులు వేయడం చాలా అవసరం. ఇలాంటి కొన్ని విషయాలను అందిపుచ్చుకోలేకపోయాం. మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే ఈ ఓటమి గత మ్యాచ్ కంటే తీవ్రంగా నిరాశపరిచింది. మ్యాచ్ సగం వరకు ఆధిపత్యం కనబర్చిన మేం ఇలా ఓడిపోవడం బాధగా ఉంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తొలి వికెట్కు కోహ్లీ, పడిక్కల్ 111 పరుగులు జోడించగా మిగతా బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు. చివరి రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నై ఆడుతూ పాడుతూ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్(11), టీమ్ డేవిడ్(1), మ్యాక్స్వెల్(9) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్కు ఓ వికెట్ దక్కింది. మరోసారి వికెట్ల వెనుకాల మహేంద్రుడు తన మాయాజాలంతో ఆర్సీబీని తక్కువ స్కోర్కే పరిమితం చేశాడు. అనంతరం చేజింగ్కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 31), అంబటి రాయుడు(22 బంతుల్లో 32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, మ్యాక్స్వెల్ ఓ వికెట్ తీశారు.
మూడు గెలవాల్సిందే..
ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. మిగిలిన ఐదు మ్యాచ్ల్లో కచ్చితంగా మూడు గెలవాల్సిందే. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో తమ కంటే బలమైన జట్లను ఢీకొట్టనుంది. ఫస్టాఫ్లో వరుస విజయాలతో దుమ్మురేపిన ఆర్సీబీ సెకండాఫ్లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. అయితే ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. ఈ తరహా ప్రదర్శనతో టోర్నీలో కొనసాగడం చాలా కష్టం.