న్యూఢిల్లీ: ఏ పని చేసినా మనస్సు పెట్టి చేయాలని, అప్పుడే సక్సెస్ లభిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. క్రికెట్ అయినా మరే పని అయినా ఇష్టంతో చేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పాడు. తన సక్సెస్ సీక్రెట్ ఇదేనని చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ 2023 విజయానంతరం స్వదేశం చేరిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఏ పని చేసినా మనస్సు పెట్టి చేయాలి. అలా కాకుండా మనస్సు ఎక్కడో పెట్టి.. తప్పుడు ఉద్దేశాలతో పాటు పనికిరాని ఘనతల కోసం పని చేస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేం. ఏ పని చేసినా అందులో పూర్తిగా భాగమవ్వాలి. అప్పుడే ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. ఆ దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఆసియాకప్ 2023లో విరాట్ కోహ్లీ అద్బుత ప్రదర్శన కనబర్చాడు. పాకిస్థాన్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో సెంచరీలతో చెలరేగాడు. ఈ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి 8వ సారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సత్తా చాటడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. సెప్టెంబర్ 22 నుంచి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్నకు ముందు ఈ మూడు వన్డేల సిరీస్ ఇరుజట్లకు ప్రాక్టీస్గా ఉపయోగపడనుంది. సెప్టెంబరు 22న మొహాలీ వేదికగా తొలి వన్డే, సెప్టెంబరు 24న ఇండోర్ వేదికగా రెండో వన్డే, సెప్టెంబరు 27న రాజ్కోట్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. గాయపడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు.
ఈ రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. అతనితో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా రీఎంట్రీ ఇస్తారు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.