లండన్: ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్ట్ సిరీస్లు గెలిచాక ప్రతీ ఒక్కరు తమతో మ్యాచ్ అంటే భయపడుతున్నారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ రెండు విజయాలు తమ గౌరవాన్ని పెంచాయన్నాడు. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు చాలా తీవ్రంగా ఉండేది. చాలా ఘర్షణ వాతావరణం కనిపించేది. కానీ, మేం ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్తా గౌరవంగా మారింది.

ఓ టెస్టు టీమ్గా మమ్మల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితులు పోయాయి. మా జట్టుపై ప్రత్యర్థులకు గౌరవం పెరిగింది. వారి సొంతగడ్డపై కూడా గట్టి పోటీ ఇస్తామని వాళ్లు గుర్తించారు. మమ్మల్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఓవల్ వేదికగా జరగనున్న వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం సాధించాలంటే పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాలి.
ఓవల్లో బ్యాటింగ్కు దిగినప్పుడు ఫ్లాట్ వికెట్ను అంచనా వేయలేం. ఆ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. రెండు జట్లకూ ఇది ఒకే మ్యాచ్. అక్కడి కండిషన్స్, పిచ్కు త్వరగా అలవాటు పడిన జట్టే విజయం సాధిస్తుంది. ఓవల్ కండిషన్స్ సవాల్తో కూడుకున్నవి. బ్యాటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని బ్యాటింగ్ చేయాలి.
మరింత ఫోకస్గా ఉంటూ పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు జట్లు ఓ తటస్థ వేదికపై ఆడటం డబ్ల్యూటీసీలోని గొప్పతనం. ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు గట్టి పోటీదారులు. ఎలాంటి పరిస్థితుల్లోనుంచైనా పుంజుకొని గట్టి పోటీనిస్తారు.
వారి నైపుణ్యం కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి బాగా ఆడాలనే తపన నాలో పెరుగుతుంది. వీలైనంత వరకు వారిపై అత్యుత్తమంగా రాణించేందుకే ప్రయత్నిస్తాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2018-19 పర్యటనలో ఆసీస్ను తొలిసారి ఓడించిన టీమిండియా.. 2020-21లో అజింక్యా రహానే సారథ్యంలో ఆసీస్ను వారి సొంతగడ్డపై రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించింది.