
అంచనా వేయలేకపోయాం..
'ఈ పిచ్పై ఎలా ఆడాలో మాకు అవగాహన లేకపోయింది. మేము ఆశించిన విధంగా షాట్స్ను ఆడలేకపోయాం. బంతి బౌన్స్ అవుతున్నప్పుడు ఎలా ఆడాలో... శ్రేయస్ అయ్యర్ మాకు చూపించాడు. కానీ.. అప్పటికే చాలా వికెట్లు చేజార్చుకున్నాం. చివరి 10 ఓవర్లప్పుడు చేతిలో 8 వికెట్లు ఉంటే ఇంగ్లండ్ ముందు పోరాటే స్కోర్ను ఉంచేవాళ్లం. కానీ ఈ పిచ్పై షాట్ సెలక్షన్లో విఫలమయ్యాం. నిజాయితీగా తప్పుల్ని అంగీకరించాలి. రెండో టీ20లో ఆ తప్పిదాల్ని దిద్దుకుని.. బలంగా బరిలోకి దిగుతాం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అదేం కాదు..
ఇక ఫార్మాట్ మారడం వల్ల బ్యాటింగ్లో తడబడ్డారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ అలాంటిదేం లేదని, గతంలో చాలా సీరీస్లు ఆడి గెలిచామని విరాట్ గుర్తు చేశాడు. 'ఫార్మాట్లకు తగ్గట్లు ఆటను మార్చుకోవడం అంత కష్టమేమి కాదు. గతంలో కూడా మేం ఇలాంటి పరిస్థితుల్లో ఆడాం. ఇదే మా ఆటపై ప్రభావం చూపిందని అనుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మేం వైట్ బాల్ క్రికెట్లో బాగానే రాణిస్తున్నాం. ఇలా ఫార్మాట్లకు తగ్గట్లు మా ఆటను మార్చుకుంటూ విజయాలందుకున్నాం. సిరీస్లు గెలిచాం. అయితే టీ20 ప్రపంచకప్ ముందు మాకున్న టీ20 సిరీస్ ఇదొక్కటే. అందుకే కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. అలాగని తేలికగా తీసుకోవడం లేదు.'అని విరాట్ స్పష్టం చేశాడు.

కోహ్లీ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్లో డకౌట్ అయిన కోహ్లీ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్ అయిన రికార్డును చెరిపేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 14 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి, క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోని 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు, మహ్మద్ అజారుద్దీన్ 8 సార్లు డకౌట్గా వెనుదిరిగారు.

ఇంగ్లండ్ పంచ్..
ఇంగ్లండ్ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఇంగ్లండ్ పేసర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.


Click it and Unblock the Notifications
