ఆట పూర్తిగా జరిగి ఉంటే..
'ముందుగా కేన్ విలియమ్సన్, అతని జట్టుకు అభినందనలు. వాళ్లు అద్భుతంగా ఆడి మూడు రోజుల్లో ఫలితం సాధించారు. వారి ప్రణాళికల ప్రకారం రాణించి మాపై ఒత్తిడి చేశారు. ఈ విజయానికి వారు అన్ని విధాలుగా అర్హులు. అయితే వర్షం అంతరాయం మా అవకాశాలను దెబ్బతీసింది. తొలి రోజు ఆట పూర్తిగా వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని కఠిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆట ప్రారంభమైన తర్వాత మేం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మెరుగైన స్థితిలో నిలిచాం. కానీ బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆపేయాల్సి వచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ జరిగుంటే మేం మరిన్ని పరుగులు చేసేవాళ్లమేమో.
కివీస్ బౌలర్లు అద్భుతం..
ఈ రోజు అయితే న్యూజిలాండ్ బౌలర్లు దుమ్మురేపారు. వారికి ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసి మమ్మల్ని విన్నింగ్ రేస్ నుంచి వెనక్కు నెట్టారు. వాస్తవానికి మేం 30, 40 పరుగులు తక్కువగా చేశాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. జట్టులో ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండటం చాలా ముఖ్యం. మా ఈ కాంబినేషన్(తుది జట్టుతో) విభిన్న పరిస్థితుల్లో విజయం సాధించాం. ఇదే మా బెస్ట్ కాంబినేషన్ అనుకున్నాం. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉందనుకున్నాం. ఆట ఇంకా ఎక్కువగా జరిగి ఉంటే స్పిన్నర్లు ప్రభావం చూపేవారేమో.
జెమీసన్ ఫెంటాస్టిక్..
జెమీసన్ ఓ నాణ్యమైన క్రికెటర్. అతను అద్బుతమైన ఏరియాల్లో బంతిని వేసాడు. బౌలింగే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించాడు. అతను ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు అతను అన్ని విధాల అర్హుడు. ఇదో గొప్ప మ్యాచ్. అంతకంటే గొప్ప విషయం టెస్ట్ క్రికెట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. అంతర్జాతీయ క్రికెట్కు టెస్ట్ ఫార్మాట్ హార్ట్ బీట్. ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. మా దగ్గర క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. వారితో మా లోపాలను సవరించుకుంటాం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
దుమ్మురేపిన కేన్ మామ
భారత్ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ అలవోకగా చేధించింది. 45.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 6 ఫోర్లు 47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఏకంగా 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరస్మరణీయ విజయాన్నందించారు.
అంతకుముందు 64/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 73 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(41), రోహిత్ శర్మ(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15), రహానే (15), జడేజా(16), అశ్విన్(7) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్కు ఓ వికెట్ దక్కింది.