
కేప్టౌన్: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నామన్నాడు. తమ బ్యాటింగ్ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని విరాట్ అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచే సువర్ణవకాశాన్ని టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ సిరీస్ను సౌతాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్.. తమ ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు.
'కీలక సమయాల్లో పేలవ బ్యాటింగ్తో కుప్పకూలడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసి తప్పిదాలు చేసేలా ఒత్తిడి పెంచారు. ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి వాటికి తగ్గట్లు బౌలింగ్ చేశారు. వారి హైట్ కూడా కలిసొచ్చింది. బ్యాటింగ్ వైఫల్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ వైఫల్యం జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. మొత్తానికి ఇదో అద్భుతమైన మ్యాచ్. తొలి మ్యాచ్లో అద్భుత విజయం అందుకున్నప్పటికీ.. సౌతాఫ్రికా పుంజుకుంది.
రెండు టెస్ట్ల్లో బంతితో రాణించి విజయాన్నందుకుంది. ఈ విజయానికి సౌతాఫ్రికా ఆటగాళ్లు పూర్తిగా అర్హులు. విదేశాల్లో వరుస విజయాలు సాధించిన మాకు సౌతాఫ్రికా గట్టి సవాల్ విసిరింది. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. సౌతాఫ్రికాను ఓడిస్తామని అందరూ అంచనా వేసారు. మేం కూడా అదే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. కానీ విజయాన్నందుకోలేకపోయాం. ఈ ఓటమిని స్వీకరిస్తూ మరింత మెరుగ్గా కమ్ బ్యాక్ చేస్తాం. ఈ సిరీస్లో కేఎల్ ఓపెనర్గా సత్తా చాటాడు. మయాంక్ విఫలమైన ఫస్ట్ టెస్ట్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ మాత్రం అద్భుతం. మిడిల్ ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడారు. ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ స్పెషల్. ఈ సిరీస్లో సెంచూరియన్ విజయం ప్రత్యేకం. సానుకూల అంశాలను తీసుకొని బెటర్ క్రికెటర్స్గా కమ్ బ్యాక్ చేస్తాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
లక్ష్యచేధనలో భాగంగా 101/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా అద్భుత బ్యాటింగ్తో 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కీగన్ పీటర్సన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాసీ వాన్ డస్సెన్(95 బంతుల్లో 3 ఫోర్లతో 41 నాటౌట్), టెంబా బవుమా(58 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.