
ఛటోగ్రామ్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు వన్డే ఫార్మాట్లో సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. 1214 రోజుల తర్వాత వన్డే ఫార్మాట్లో విరాట్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 113) మూడెంకల స్కోర్ను అందుకున్నాడు. 2019లో వెస్టిండీస్పై చివరిసారిగా వన్డే శతకాన్ని అందుకున్న కోహ్లీ.. మళ్లీ ఇన్నాళ్లకు సెంచరీ సాధించాడు. ఓవరాల్గా 72వ సెంచరీ నమోదు చేసిన కింగ్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(71)ను అధిగమించాడు.
బంగ్లాదేశ్తో 2019లో డేనైట్ టెస్ట్ మ్యాచ్లో 70వ సెంచరీ అందుకున్న విరాట్.. 71వ సెంచరీకి మూడేళ్ల సమయం తీసుకున్నాడు. ఆసియా కప్ 2022 ముందు వరకు నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన విరాట్.. నెల రోజుల సుదీర్ఘ విరామంతో మళ్లీ టచ్లోకి వచ్చాడు. ఆసియాకప్లో అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ మూడేళ్ల తర్వాత 71 సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తర్వాత పాత కోహ్లీలా చెలరేగిన కోహ్లీ.. బంగ్లాతో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. నామమాత్రపు మూడో వన్డేలో ఎబాదత్ హోస్సెన్ బౌలింగ్లో సిక్స్ బాది వన్డే సెంచరీ నిరీక్షణకు తెరదించాడు.
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ డబుల్ మెరుపులతో ప్రశాంతంగా ఆడిన కోహ్లీ సెంచరీ అనంతరం నవ్వులు చిందించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్తో ఈ సెంచరీకి మూడేండ్లు పట్టిందన్నాడు. 'three fu***ng years boys"'అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీకి విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 409 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 143 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.