పుణే: వన్డే ప్రపంచకప్ 2023లో బిగ్ టీమ్స్ అంటూ ఏవి లేవని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అలా కాకుండా పెద్ద జట్లు ఉన్నాయని, వాటిపై మాత్రమే ఫోకస్ పెడుతామంటే ఘోర పరాభావాలు ఎదురవుతాయని కింగ్ కోహ్లీ హెచ్చరించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్తో కలిసి కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా షకీబ్ అల్హసన్ బలాలను తెలియజేస్తూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'చాలా ఏళ్లుగా షకీబ్ అల్ హసన్ బౌలింగ్ ఆడుతున్నా. అతని బౌలింగ్లో కంట్రోల్ ఉంటుంది. పైగా అతను ఎంతో అనుభవం కలిగిన బౌలర్.

కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. బ్యాటర్ను ఎలా ఇబ్బంది పెట్టగలడో కూడా నాకు బాగా తెలుసు. చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తాడు. ఈ తరహా బౌలర్లను ఎదుర్కొంటున్నప్పుడు మన అత్యుత్త ఆటను బయటకు తీయాలి. అలా చేయకుంటే.. వారు మనపై ఒత్తిడి పెంచి ఔటయ్యేలా చేస్తారు.
ప్రపంచకప్లో పెద్ద జట్లు అంటూ ఏం ఉండవు. అలా కాకుండా పెద్ద జట్లపైనే ఫోకస్ పెడతానంటే ఘోర పరాభావాలే ఎదురవుతాయి.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే పసికూన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఓడించగా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను అఫ్గానిస్థాన్ మట్టి కరిపించింది.
ఈ ఫలితాలను ఉద్దేశించే విరాట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ జట్టును తక్కువ అంచనా వేయవద్దని సూచించాడు. షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వికెట్ విలువ ఏంటో తెలియజేశాడు. 'కోహ్లీ ప్రత్యేకమైన బ్యాటర్. ఈ తరంలో అత్యుత్తమ ఆటగాడు. అతన్ని ఐదు సార్లు ఔట్ చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఎంతో సంతోషపడుతున్నా.'అని తెలిపాడు.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం షకీబ్ అల్ హసన్ను కొనియాడాడు. అతనో తెలివైన క్రికెటరని, బంగ్లాదేశ్ జట్టును చాలా ఏళ్లుగా తన భుజాలపై మోస్తున్నాడని చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వికెట్ కోసం వ్యూహాలు రచిస్తున్నామని, మూడు రోజుల ముందే అతన్ని గురించి ఆలోచిస్తున్నామంటే.. అతను ఎలాంటి క్రికెటరో అర్థం చేసుకోవచ్చని ప్రశంసించాడు.