
చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చి రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకున్న మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సైనీలు ఈ సీజన్ ఐపీఎల్లో దుమ్ములేపుతారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్కు తెరలేనుంది. ఈ హై ఓల్టెజ్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురువారం మీడియాతో మాట్లాడాడు.
భారత్కు ఆడటం సైనీ, సుందర్, సిరాజ్, చాహల్ వ్యక్తిత్వాలను మార్చేసిందన్నాడు. తమ జట్టు సరైన దిశలో పయనించేందుకు, సమష్టిగా రాణించేందుకు వారి అనుభవం సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. 'మా కుర్రాళ్లు కావాల్సినంత ఆత్మవిశ్వాసం, అనుభవం పొందారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు ప్రభావం చూపగలరని ప్రత్యర్థులకూ తెలుసు. ఇది మాకు కలిసొచ్చే అంశం. ఏదేమైనా చిన్నస్వామిలో ఆడినంత మజా ఉండదు.
కానీ ఐపీఎల్ స్వదేశానికి రావడం సానుకూల అంశం. అయితే ఈసారీ ఎవరికీ హోమ్ గ్రౌండ్ ఫెసిలిటీ లేదు. ప్రతి జట్టు తటస్థ వేదికల్లోనే ఆడుతోంది. సొంత బలాలపై ఆధాపడతారు కాబట్టి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే 3-4 మ్యాచులను కాపాడుకోవాలి. ఇక టోర్నీకి వ్యూయర్షిప్ పెరగడం గొప్ప విషయం' అని కోహ్లీ అన్నాడు.
'గతేడాది మేం టైటిల్ రేసులో నిలిచాం. ఈ సారి గట్టి పోటీనిస్తామన్న విశ్వాసం ఉంది. కొత్త కుర్రాళ్లు రావడం ఆసక్తికరంగా ఉంది. మాక్స్వెల్ వచ్చాడు. రిచర్డ్సన్ చేరాడు. డాన్ క్రిస్టియన్, డేనియెల్ సామ్స్, భారత ఆటగాళ్లూ చేరారు. ఇప్పుడున్న వనరుల పట్ల సంతృప్తిగా ఉంది. తొలి మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మా కోచ్లు ఉపయోగిస్తున్న భాష చాలా బాగుంది. కోచింగ్ బృందంలో కొందరు కొత్తవాళ్లు వచ్చినా స్వేచ్ఛను ఇస్తున్నారు' అని విరాట్ కోహ్లీ తెలిపాడు.