భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ 2023: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) క్షమాపణలు చెప్పాడు. అతనికి దక్కాల్సిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను సెంచరీతో తాను లాక్కున్నానని చమత్కరించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
విరాట్ కోహ్లీ(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 103 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం కంటే.. విరాట్ కోహ్లీ సెంచరీపైనే ఉత్కంఠ నెలకొనడం గమనార్హం. భారత్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో పూర్తిగా స్ట్రైకింగ్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. క్విక్ డబుల్స్, సింగిల్స్తో సెంచరీపై ఆసక్తి రేకెత్తించాడు.

భారత్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ పూర్తవ్వడానికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో భారత్ విజయం కంటే కోహ్లీ సెంచరీ చేయడంపైనే ఉత్కంఠ నెలకొంది. చివరకు నసుమ్ వేసిన 42 ఓవర్లో విరాట్ కోహ్లీ సిక్స్ బాది సెంచరీతో పాటు టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
సారీరా.. జడ్డూ!
ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ.. తన సెంచరీ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. 'జడ్డూ (Ravindra Jadeja) నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను లాక్కున్నందుకు క్షమించండి(నవ్వుతూ). భారత విజయంలో కీలక పాత్ర పోషించాలని అనుకున్నాను. ప్రపంచకప్లో హాఫ్ సెంచరీలు చేస్తున్న నేను సెంచరీల్లా కన్వర్ట్ చేయలేకపోతున్నాను.
ఈ మ్యాచ్లో సెంచరీతో పాటు భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని గట్టిగా అనుకున్నాను. నాకు ఈ మ్యాచ్లో డ్రీమ్ స్టార్ట్ లభించింది. రెండో నోబాల్స్ దక్కడం.. వాటిని ఫోర్, సిక్స్గా మలచడం గొప్పగా ఉంది. పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది. దాంతో నా సహజ గేమ్ ఆడే అవకాశం దక్కింది.

డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సూపర్...
బంతిని టైమ్ చేయడంతో పాటు గ్యాప్స్లో ఆడాను. క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయడంతో అవసరమైనప్పుడు బౌండరీలు బాదాను. డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. ఒకరికొరు చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. దాని ఫలితం మైదానంలో కనబడుతోంది. ఇదో సుదీర్ఘ టోర్నీ అనే విషయం మాకు తెలుసు.
ఓ మూమెంటమ్ను క్రియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై ఇంతమంది అభిమానుల ముందు ఆడటం ప్రత్యేకమైన అనుభూతి. ఇదే జోరును కొనసాగించాలని మేం భావిస్తున్నాం.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.