
అద్భుత విజయం..
‘ఈ విజయం చాలా గొప్పది. టీ20 క్రికెట్లో గత కొంతకాలంగా మేం బాగా ఆడుతున్నాం. సమష్టిగా రాణిస్తూ విజయాలందుకుంటున్నాం. అయితే ఈ సిరీస్లో మా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లేకుండానే విజయాన్నందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. గర్వంగా కూడా ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్ ద్వారా కనీసం 14 మ్యాచ్లు ఆడారు. కాబట్టి వారికి వారి ప్రణాళికలు తెలుసు. ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయకుండా నిలువరించి చిన్న బౌండరీ సాయంతో చేధించాలనుకున్నాం. ఇక జట్టుగా రాణించి విజయాన్నందుకుంటే ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుంది. ఈ రోజు యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

పాండ్యా అసాధారణ ఆటగాడు..
2016లో తన సామర్థ్యంతోనే పాండ్యా జట్టులోకి వచ్చాడు. అతనిలో అపార నైపుణ్యం ఉంది. అలాగే ఇది తన సమయమని తెలుసుకున్నాడు. మరో నాలుగైదేళ్లు, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించగలడు. అతని ప్రణాళికలు సరైనవి, అతన్ని ఇలా చూడటం ఆనందంగా ఉంది. పరిస్థితులను ఆకలింపు చేసుకోని ఆడాలనుకున్నాం. అభిమానుల నుంచి కూడా మాకు ఉత్సాహం లభించింది. ఏబీ డివిలియర్స్లా స్కూప్ షాట్ ఆడుతానని ఆండ్రూ టై ఊహించి ఉండడని హార్దిక్తో అన్నా. తాను కూడా ఏమాత్రం ఊహించలేదని చెప్పాడు. ఈ నైట్ ఈ షాట్ గురించి ఏబీడీకి మెసేజ్ చేస్తా. అతనేం అంటాడో చూస్తా'అని విరాట్ చెప్పుకొచ్చాడు.

ఆల్రౌండ్ షో..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. తాత్కలిక సారథి మాథ్యూ వేడ్(38 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 58), స్టీవ్ స్మిత్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, శార్ధూల్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), కేఎల్ రాహుల్(22 బంతుల్లో 2 సిక్స్తో 30) మెరుపులు మెరిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో సామ్స్, టై, స్వెప్సన్, జంపా చెరొక వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
