ఇంకా మెరుగుపడాలి..
'తొలి టెస్టు ఓడిన తర్వాత కోలుకొని తర్వాతి మ్యాచ్ గెలవడం అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించగా, మా బౌలర్లు విఫలమయ్యారు. అయితే రెండో టెస్టులో మా బ్యాటింగ్ ఏమిటో చూపించాం. మా రిజర్వ్ ఆటగాళ్లు కూడా చాలా బాగా ఆడుతుండటం టీమ్కు మేలు చేసే అంశం. జట్టు సంధి దశలో ఉన్నప్పుడు జట్టు ప్రమాణాలు పడిపోవు. పంత్, సుందర్ భాగస్వామ్యం ఇదే చూపించింది. సిరీస్ గెలవడం సంతోషకరమే అయినా మేం ఇంకా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఏ అంతర్జాతీయ జట్టయినా పటిష్టంగానే ఉంటుంది.
అశ్విన్ అద్భుతం..
స్వదేశంలో అయినా వారిని ఓడించేందుకు శ్రమించాల్సిందే. మున్ముందు కూడా కొన్ని ఆటుపోట్లు తప్పకపోవచ్చు. కానీ వాటినీ సమర్థంగా ఎదుర్కొంటాం. గత ఆరేడేళ్లుగా టెస్టుల్లో అశ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ చేసిన సెంచరీ ఈ సిరీస్లో గుర్తుంచుకోదగ్గ అంశం. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై 150 అంటే 250 పరుగులు చేసినంత విలువ. న్యూజిలాండ్లో మేం ఆడిన సమయంలో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అనేది అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చింది. ఆ సవాల్ను స్వీకరించేందుకు రెడీ.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అశ్విన్, అక్షర్ మ్యాజిక్..
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'.... పంత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాలు లభించాయి.
12 నుంచి టీ20 సిరీస్
చెన్నైలో తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన భారత్ చివరకు 3-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. తాజా విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్లోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.