ప్రస్తుతం జనాలు ఆట కంటే మసాలను ఎక్కువ కోరుకుంటున్నారని, ఆటగాళ్ల గొడవలు, వాగ్వాదాలను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ కారణంగా నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్తో తనకు జరిగిన చిన్నపాటి వాగ్వాదాన్ని జనాలు బాగా ఎంజాయ్ చేశారని తెలిపాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ నేపథ్యంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్తో గొడవకు ముగింపు పలకడంతో జనాలు తీవ్ర నిరాశకు గురయ్యారని అభిప్రాయపడ్డాడు.

వారికి అది నచ్చలేదు
'ఈ సీజన్లో నా ప్రవర్తనతో జనాలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే నేను నవీన్ ఉల్ హక్ను హగ్ చేసుకున్నాను. ఆ తర్వాత గౌతీ భాయ్ నన్ను హగ్ చేసుకున్నాడు. దాంతో జనాలకు కావాల్సిన మసాలకు ముగింపు పడింది(నవ్వుతూ).'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో నవీన్ ఉల్ హక్తో విరాట్ కోహ్లీకి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అయితే తాను పరుగెత్తలేదని, తన షూ మట్టిని కోహ్లీ చూపించాడు. ఈ చర్యలను గంభీర్, నవీన్ ఉల్ హక్తో పాటు జనాలంతా అపార్థం చేసుకున్నారు.
షూ చూపించడంతో..
నవీన్ ఉల్ హక్ తన కాలి మట్టితో సమానమని కోహ్లీ అన్నాడని భావించారు. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో నవీన్ ఉల్ హక్.. మరోసారి కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ చెందిన ఆటగాడితో కోహ్లీ మాట్లాడుతుండగా.. గంభీర్ జోక్యం చేసుకొని అతనితో గొడవ పెట్టుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్లోనే ఇది అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని కోహ్లీ, గంభీర్ మరిచిపోయినా.. నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా కొనసాగించాడు. ఆర్సీబీ, కోహ్లీని నేరుగా ప్రస్తావించకుండా కవ్వించాడు. తీవ్రంగా పరిగణించిన కోహ్లీ ఫ్యాన్స్..నవీన్ ఉల్ హక్తో పాటు గంభీర్కు చుక్కలు చూపించారు. వాళ్లు కనబడ్డప్పుడల్లా కోహ్లీ కోహ్లీ.. అంటూ గేలి చేశారు.
నవీన్ ఉల్ హక్కు చుక్కలు..
వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్లోనూ నవీన్ ఉల్ హక్ను కోహ్లీ ఫ్యాన్స్ గేలి చేశారు. అయితే అలా చేయవద్దని సూచించిన కోహ్లీ.. నవీన్ ఉల్ హక్ను హగ్ చేసుకొని గొడవకు ముగింపు పలికాడు. ఈ గొడవ కారణంగా గంభీర్పై లక్నో వేటు వేయగా.. అతను కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు. తాజా సీజన్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో గంభీర్.. కోహ్లీని హగ్ చేసుకొని తమ గొడవకు ముగింపు పలికాడు.