టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆటకు దూరమైతే మళ్లీ ఎవరికి కనిపించనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ అధికారిక వెబ్సైట్తో మాట్లాడిన కోహ్లీ.. తన రిటైర్మెంట్ ప్లాన్స్పై స్పందించాడు.
'ఓ క్రీడాకారుడిగా కెరీర్కు ఏదో ఒక రోజు ముగింపు పలకాల్సిందే. అయితే రిటైర్మెంట్ డేట్ను ఊహించుకుంటూ ఉండే కంటే మనం చేయగలిగిన దానిపై ఫోకస్ పెట్టాలి. అందుకే నేను గతం గురించి ఆలోచించను. ఆ మ్యాచ్లో అలా ఆడాల్సి ఉంటే బాగుండని బాధపడను. అలా ఆలోచిస్తూ కెరీర్ను ముగించదల్చుకోలేదు.

అసలు అలాంటి విషయాలనే పట్టించుకోను. నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను. అక్కడితో వదిలేసి తదుపరి మ్యాచ్లో ఏం చేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెడుతాను. రిటైర్మెంట్ తీసుకుంటే నేను మళ్లీ ఎవరికి కనిపించను(నవ్వుతూ). కాబట్టి నేను ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడుతాను. ఆ స్పూర్తే నన్ను ముందుకు నడిపిస్తోంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా పొట్టి కప్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు.
ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది. 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ 18 పరులు తేడాతో గెలిస్తేనే మెరుగైన రన్రేట్తో ప్లే ఆఫ్స్ చేరుతోంది. లేదంటే సీఎస్కే విధించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాలి. అయితే బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉంది.
35 ఏళ్ల విరాట్ కోహ్లీ మరో 5 ఏళ్లు సునాయసంగా క్రికెట్ ఆడగలడు. అతనికి ఉన్న ఫిట్నెస్కు మరో ఐదేళ్లు కొనసాగడం పెద్ద కష్టమేం కాదు. టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉంది. టెస్ట్లు, వన్డేల్లో మాత్రమే కోహ్లీ కొనసాగనున్నాడు.