
హైదరాబాద్: మొబైల్ గ్యాలరీ నిండా తన గారాల పట్టీ వామికా ఫొటోలే ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కంటే వామికా ఫొటోలనే తాను ఎక్కువగా తీస్తానని తెలిపాడు. వామికాకు సంబంధించిన ప్రతీ మూమెంట్ను తాను క్లిక్ చేస్తానన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం సిద్దమవుతున్న కోహ్లీ.. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ఫొటో షూట్లో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆర్సీబీ బోల్డ్ డైరీస్ కార్యక్రమంలో భాగంగా ఫ్రాంచైజీకి చెందిన మీడియా ప్రతినిథితో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. తన దృష్టిలో సచిన్ టెండూల్కర్, వీవియన్ రిచర్డ్స్ మాత్రమే క్రికెట్ దిగ్గజాలని తెలిపాడు.
'వామికా ఫొటోలతో నా ఫోన్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. నా మొబైల్ ఫోన్తో వామికాకు సంబంధించి చాలా ఫోటోలను తీసాను. ప్రతీసారి సహజంగా వస్తాయని చెప్పలేను కానీ.. అనుష్కతో ఉన్నప్పుడు, క్యూట్ పనులు చేస్తున్నప్పుడు.. నడుస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటాను. ఆమెకు సంబంధించిన అన్ని క్షణాలను నా ఫోన్లో బంధిస్తూ ఉంటాను.
నా ప్రకారం గ్రేటెస్ట్ ఆల్టైమ్ క్రికెటర్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు నా స్పూర్తిదాత, హీరో సచిన్ టెండూల్కర్ అయితే మరొకరు వీవియన్ రిచర్డ్స్. నేను ఎప్పుడూ ఈ ఇద్దరి పేరే చెబుతుంటాను. ఈ ఇద్దరూ తమదైన ఆటతో బ్యాటింగ్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారు. అందుకే ఈ ఇద్దర్నీ నేను దిగ్గజాలుగా కీర్తిస్తుంటాను.
నా కొత్త టాటూ ఇంకా పూర్తవ్వలేదు. సగమే అయ్యింది. ప్రస్తుతానికి దీని గురించి వివరించలేను. టాటూ పూర్తయ్యాక చెబుతా. విశ్రాంతి సమయంలో మ్యూజిక్ వినేందుకు ప్రయత్నిస్తాను. యయిటీస్ కిడ్ అయిన నేను ట్రంప్ కార్డ్స్ ఆడుతూనే పెరిగాను. డబ్ల్యూడబ్ల్యూ స్టార్స్తో ఉండే కార్డ్స్ కోసం స్నేహితులతో పోటీ పడేవాడిని. సినిమా యాక్టర్స్ కంటే క్రికెటర్ల పోస్టర్లను ఎక్కువగా ఇష్టపడేవాడిని. భారత్లో నాకు ఉత్తరాఖండ్ అంటే చాలా ఇష్టం. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
టీ20 ప్రపంచకప్ అనంతరం అక్కడికి వెళ్లి ఫ్యామిలీతో గడిపాను. బైక్స్ కంటే కార్లనే ఉపయోగిస్తా. నేను సొంతంగా డ్రైవ్ చేయాల్సి అవసరం ఎప్పుడూ ఉండదు. నేను కూడా పెద్దగా ఆసక్తి చూపను.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్కు శుక్రవారం(మార్చి 31) తెరలేవనుండగా.. ఆదివారం ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది.