బీసీసీఐ ప్రత్యేక నివాళి..
52 ఏళ్ల వయసులోనే అర్థంతరంగా తనువు చాలించిన దిగ్గజానికి క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. టీమిండియా క్రికెటర్లు సైతం వార్న్కు నివాళి అర్పిస్తూ అతనితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే వార్న్ అకాల మరణం తనను షాక్ గురి చేసిందని భావోద్వేగానికి గురయ్యాడు.
జీవితం మనం ఊహించినట్లు ఉండదన్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మిగతా క్రికెటర్లు వార్న్కు నివాళిలు అర్పించారు .

కోహ్లీ భావోద్వేగం..
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. వార్న్తో ఆడే అదృష్టం తనకు లేకపోయినా ఇప్పటికీ అతనో గొప్ప స్పిన్నరని కొనియాడాడు. 'నిన్న రాత్రి దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణ వార్త తెలిసింది. అతను చనిపోయాడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. అతను చనిపోవడం ఏంటని అనుకున్నా.
కానీ అది నిజమని తెలిసిన తర్వాత దుఃఖం ఆపుకోలేకపోయా. నిజంగా జీవితం మనం ఊహించినట్లు ఉండదు. ఈ క్షణంలో బాగానే ఉన్నామనిపిస్తుంది.. కానీ మరుక్షణంలో ఏం జరగబోయేది ఎవరు చెప్పలేరు. జీవితం అనూహ్యమైంది.. ఊహించలేనిది.

త్వరగా వెళ్లిపోయాడు..
వార్న్ తన 15 ఏళ్ల క్రికెట్ జీవితంలో చాలానే చూశాడు. క్రికెట్ బంతిని అతనికంటే గొప్పగా ఎవరూ టర్న్ చేయలేరు. క్రికెట్ తర్వాత కూడా జీవితంలో చాలా చూస్తాడు అనుకున్నా.. కానీ 52 ఏళ్లకే ఇలా భౌతికంగా దూరమవుతాడని అనుకోలేదు. చాలా త్వరగా వార్న్ ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. వార్న్తో కలిసి ఆడే అదృష్టం మాకు లేకపోయినప్పటికి.. ఆఫ్ ఫీల్డ్లో అతను నాకు బాగా తెలుసు.
అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తి. ఇప్పటికీ నాకు బూస్టప్ కావాలంటే వార్న్ బౌలింగ్ వీడియోలను పెట్టుకొని చూస్తుంటా. ఆ పర్సనాలిటి.. చరిష్మా కనబడదు అంటే జీర్ణించుకోలేకపోతున్నా. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా'' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
